కూల్చివేత నోటీసులను షోకాజ్‌‌లుగా మార్చండి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

కూల్చివేత నోటీసులను షోకాజ్‌‌లుగా మార్చండి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేట ప్రాంతంలో దుర్గం చెరువు ఎఫ్‌‌టీఎల్‌‌ పరిధిలోని నిర్మాణాల తొలగింపు నిమిత్తం ఇచ్చిన నోటీసులనే షోకాజ్‌‌ నోటీసులుగా మార్చాలని ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. షోకాజ్‌‌ నోటీసులపై పిటిషనర్లు సమర్పించే డాక్యుమెంట్స్, ఇతర ఎవిడెన్స్‌‌లను పరిశీలించాకే అధికారుల చర్యలు ఉండాలంది. శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేటలో 15 ఎకరాల్లో వేసిన లేఔట్‌‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి వాల్టా చట్టంలోని సెక్షన్‌‌ 23 కింద డిప్యూటీ కలెక్టర్‌‌ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి.

వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ జె.శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్లు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. 1998లో లేఔట్‌‌లో ప్లాట్లు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టామన్నారు. ఇప్పుడు ఇవి ఎఫ్‌‌టీఎల్‌‌ పరిధిలో ఉన్నాయని, వాటిని తొలగించాలంటూ నోటీసులు జారీ చేశారన్నారు. 

కనీసం తమ వివరణ కూడా తీసుకోకపోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే జారీ చేసిన నోటీసులను షోకాజ్‌‌ నోటీసులుగా పరిగణిస్తామని, పిటిషనర్లు అభ్యంతరాలను తెలియజేయవచ్చన్నారు. ఆ తరువాతే చట్టప్రకారం ముందుకెళతామని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం పిటిషనర్లు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తరువాత చట్టప్రకారం ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించింది.