ఎంసెట్ కౌన్సెలింగ్ ఆపాలని హైకోర్టు ఆదేశం

ఎంసెట్ కౌన్సెలింగ్ ఆపాలని హైకోర్టు ఆదేశం
  • జేఎన్టీయూను ఆదేశించిన హైకోర్టు
  • ఇంటర్ మార్కుల రూల్స్ మార్చుతూ రెండ్రోజుల్లో జీవో ఇస్తామన్న సర్కార్

హైదరాబాద్, వెలుగు: గురువారం నుంచి జరగాల్సిన ఎంసెట్‌ సెకండ్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ను ఆపేయాలని జేఎన్‌టీయూను హైకోర్టు ఆదేశించింది. కరోనా మహమ్మారి వల్ల ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫీజు చెల్లించి ఎగ్జామ్స్‌ రాయలేకపోయిన, పరీక్షలు రాసి ఫెయిల్‌ అయిన స్టూడెంట్లకు ఇంటర్‌ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు పెట్టలేదు.ఇలాంటి స్టూడెంట్లను 35 శాతం మార్కులు వచ్చినట్లుగా పరిగణించి పాసైట్లు ప్రకటించింది. దీంతో, ఎంసెట్‌ షరతులకు అనుగుణంగా తమకు 45 శాతం మార్కులు రాలేదని, కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం లేకపోవడంతో తమకు అన్యాయం జరుగుతోందని దిగ్గిళ్ల సాకేత్‌ చైతన్య ఇతర స్టూడెంట్లు హైకోర్టును ఆశ్రయించారు.

బుధవారం జస్టిస్‌ పి.నవీన్‌రావు ఈ పిల్​ను విచారించారు. పిటిషనర్ల తరహా 35 శాతం మార్కులు వచ్చిన స్టూడెంట్లను ఎంసెట్‌ సెకండ్‌ కౌన్సెలింగ్‌కు అనుమతిస్తామని ప్రభుత్వ హామీ మేరకు వారందరినీ రెండో విడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని, ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసే వరకూ రెండో విడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా వేయాలని ఎంసెట్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న జేఎన్‌టీయూను హైకోర్టు ఆదేశించింది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలంటే 40/45 శాతం చొప్పున మార్కులు విధిగా వచ్చి ఉండాలనే నిబంధనను సవరించి 35 శాతం వచ్చిన విద్యార్థులను కూడా అనుమతిస్తామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ఇచ్చిన హామీని హైకోర్టు రికార్డుల్లో నమోదు చేసింది. ఎంసెట్‌ రూల్స్ సడలించాలని సర్కార్ నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు రెండు రోజుల్లో జీవో జారీ ఇస్తుందని ఏజీ తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. జీవో జారీ అయ్యే వరకూ రెండో విడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిలిపివేయాలని ఆర్డర్స్ ఇస్తూ విచారణ వాయిదా వేశారు.