
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 400 సీట్లు వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు సంబంధించి బీజేపీ వేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఈ నెల 10న స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 22న విచారణ జరగగా.. వివరాలు అందించేందుకు గడువు కావాలని ఫిర్యాదుదారుడి తరఫు అడ్వకేట్ కోరారు. దీంతో జడ్జి విచారణను జులైకి వాయిదా వేశారు.
అయితే, కేసు మెరిట్స్ లోకి కూడా వెళ్లకుండా వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వర్లు హైకోర్టులో అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేయగా, దానిపై గురువారం రాత్రి జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి విచారించారు. పిటిషనర్ తరఫు అడ్వకేట్ దేవినేని హంస వాదిస్తూ.. క్రిమినల్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోకుండా మెజిస్ట్రేట్ కోర్టు సుదీర్ఘ కాలానికి వాయిదా వేయకూడదని, చట్ట ప్రకారం మెజిస్ట్రేట్ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించాలన్నారు.
ఒక రోజు కంటే ఎక్కువ వాయిదా వేస్తే దానికి కారణాలను నమోదు చేయాలని నిబంధనలు ఉన్నాయన్నారు. క్రిమినల్ ఫిర్యాదును వెంటనే పరిగణనలోకి తీసుకునేలా మెజిస్ట్రేట్ కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు వాదిస్తూ.. ఇది అత్యవసరంగా విచారించాల్సిన పిటిషన్ కాదని, ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదన్నారు. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని కోరారు. అనంతరం కోర్టు విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేసింది.