డ్రగ్స్ కేసులో దర్యాప్తు నివేదిక ఇవ్వండి-హైకోర్టు ఆదేశం

డ్రగ్స్ కేసులో దర్యాప్తు నివేదిక ఇవ్వండి-హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాని కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ కేసుపై 2017 సంవత్సరంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిల్ పై ఇవాళ  హైకోర్టులో విచారణ జరిగింది. ఇంటర్నేషనల్ స్మగ్లర్ల ప్రమేయం ఉన్నందున ఎక్సైజ్ సిట్ పరిధి సరిపోదంటూ రేవంత్ రెడ్డి పిల్ వేశారు. కేసు చాలా పెద్దదని.. సీబీఐ, ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వంటి కేంద్ర సంస్థలకు అప్పగించాలని రేవంత్ రెడ్డి కోరారు.

కేసు దర్యాప్తునకు ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సిద్ధంగా ఉన్నాయని న్యాయవాది రచనా రెడ్డి తెలిపారు. ఈడీ, ఎన్ సీబీకి రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదని న్యాయవాది రచనా రెడ్డి వాదించారు. సిట్ దర్యాప్తు ఎంత వరకు వచ్చింది.. ప్రస్తుతం ఏ స్థితిలో ఉందో డిసెంబరు 10 లోగా తెలపాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.