పది లక్షలు గుంజి..మా కొడుకును చంపిన్రు.. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని హాస్పిటల్ పై దాడి

పది లక్షలు గుంజి..మా కొడుకును చంపిన్రు.. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని  హాస్పిటల్ పై దాడి

ముషీరాబాద్, వెలుగు: హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న యువకుడు చనిపోవడంతో బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ హాస్పిటల్​పై దాడికి దిగారు. ఈ ఘటన ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని శ్రీకర హాస్పిటల్​ వద్ద ఆదివారం జరిగింది. బాధితులు తెలిపిన ప్రకారం.. 

మాణిక్యేశ్వర్ నగర్ వడ్డెర బస్తీకి చెందిన శేఖర్ నీల దంపతుల కొడుకు జ్ఞానేశ్వర్(20) ఈ నెల 16న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆర్టీసీ క్రాస్​ రోడ్డులోని శ్రీకర హాస్పిటల్​కు తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ఆదివారం అతడు మృతిచెందినట్లు డాక్టర్లు కుటుంబానికి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, మిత్రులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

రూ.10 లక్షలు వసూలు చేసి పది రోజులు చికిత్స అందించాక ఎలా మృతిచెందాడని హాస్పిటల్​ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహానికి గురై హాస్పిటల్​ అద్దాలు, ఫర్నిచర్​ ధ్వంసం చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే యువకుడు మృతిచెందాడని ఆరోపించారు.