కుంగిపోతున్న జోషిమఠ్
గోపేశ్వర్ (ఉత్తరాఖండ్) : హిమాలయన్ టౌన్ జోషిమఠ్లోని ఇండ్లకు పగుళ్లు వస్తున్నాయి. భూమి కుంగిపోతున్నది. రోడ్లు బీటలు వారుతున్నాయి. దీంతో ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి జోషిమఠ్ను గేట్వేగా పిలుస్తారు. ఎన్టీపీసీ చేపడుతున్న డెవలప్మెంట్ ప్రాజెక్టులే దీనికి కారణమంటూ జోషిమఠ్ ప్రజలు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే జోషిమఠ్ మునిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బద్రీనాథ్ కోసం హెలాంగ్, మార్వాడి మధ్య ఎన్టీపీసీ నిర్మిస్తున్న టన్నెల్తో పాటు బైపాస్ రోడ్డు నిర్మాణం ఆపేయాలని అక్కడివాళ్లు డిమాండ్ చేస్తున్నారు. తపోవన్– విష్ణుగడ్ హైడల్ ప్రాజెక్టు కూడా ఈ విపత్తుకు కారణమని ఆరోపిస్తున్నారు. పునరావాసం కల్పించాలని కోరుతున్నారు.
జోషిమఠ్కి వస్తాను : సీఎం పుష్కర్ సింగ్ ధామి
‘‘జోషిమఠ్లో నెలకొన్న పరిస్థితిని నేను సమీక్షిస్తున్నా. తొందరలోనే కుంగిపోయిన ఏరియాను సందర్శిస్తాను. అధికారుల నుంచి రిపోర్టు అందగానే అవసరమైన చర్యలు తీసుకుంటాను. అక్కడి పరిస్థితిపై మున్సిపల్ అధికారులతోనూ మాట్లాడాను. భయపడాల్సిన అవసరం లేదు. నిపుణులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను’’అని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు.
తరలిపోయిన 60 కుటుంబాలు
జోషిమఠ్లోని 600 కుటుంబాలు రిస్క్లో ఉన్నాయి. ఇప్పటికే 60 ఫ్యామిలీస్ అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఇంకో 29 కుటుంబాలను అధికారులు ఇతర ప్రాంతాలకు తరలించారు. జోషిమఠ్లోని రోడ్ల పరిస్థితిపై ఐఐటీ రూర్కీ టీం రిపోర్టు సిద్ధం చేసి సీఎంకు ఇవ్వనుంది. తొలుత 3 వార్డులకే పరిమితమైన పగుళ్లు ఇప్పుడు 9 వార్డులకు వ్యాపించాయి. 561 ఇండ్లకు పగుళ్లు వచ్చాయి. మున్సిపాల్టీ భవన్, స్కూల్, మిలన్ కేంద్రం, గురుద్వారాను సేఫ్ ప్లేస్కు తరలించారు. కొన్ని చోట్ల భూమి నుంచి నీళ్లు బయటికి వస్తున్నాయి.

