చెన్నై: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా హాకీ టీమ్ అదిరిపోయే బోణీ చేసింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్లో ఇండియా 7–2తో చైనాను చిత్తు చేసింది. ఇండియా తరఫున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (5, 8వ ని.), వరుణ్ కుమార్ (19, 30వ ని.) పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మల్చగా, సుక్జీత్ సింగ్ (15వ ని.), ఆకాశ్దీప్ సింగ్ (16వ ని.), మన్దీప్ సింగ్ (40వ ని.) గోల్స్ చేశారు. చైనా ప్లేయర్లు వెన్హుయ్ (18వ ని.), జీషెంగ్ గావో (25వ ని.) గోల్స్ కొట్టారు. ఆరంభం నుంచే మంచి సమన్వయంతో కదిలిన ఇండియన్ ఫా ర్వర్డ్స్ ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రత్యర్థుల అనుభవలేమిని ఆసరాగా తీసుకుని గోల్స్తో రెచ్చిపోయారు. తొలి క్వార్టర్లో వచ్చిన రెండు పెనాల్టీలను హర్మన్ గోల్స్గా మలిచాడు.
రెండో క్వార్టర్లో వరుణ్.. చైనీస్ డిఫెన్స్ను చెల్లాచెదురు చేశాడు. శుక్రవారం జరిగే మ్యాచ్లో ఇండియా, జపాన్తో తలపడుతుంది. మరో మ్యాచ్లో మలేసియా 3–1తో పాకిస్తాన్పై నెగ్గింది. మలేసియా తరఫున అషారి ఫిర్హాన్ (28, 29వ ని.), సిల్వెరియస్ షెల్లో (44వ ని.) గోల్స్ చేయగా, అబ్దుల్ రెహమాన్ (55వ ని.) పాక్కు గోల్ అందించాడు. జపాన్తో జరిగిన మ్యాచ్లో కొరియా 2–1తో గెలిచింది. కొరియా ప్లేయర్లు పార్క్ (26వ ని.), కిమ్ జుంగుహో (35వ ని.) గోల్స్ చేయగా, ఊకా రైమో (6వ ని.) జపాన్ తరఫున గోల్ సాధించాడు.