ఇస్లామాబాద్ : తోషాఖానా కేసులో దోషిగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఇస్లామాబాద్ హైకోర్టు(ఐహెచ్సీ) భారీ ఊరట కల్పించింది. జిల్లా కోర్టు విధించిన జైలు శిక్షను ఐహెచ్సీ సస్పెండ్ చేసింది. రూ.లక్ష ష్యూరిటీ మీద ఇమ్రాన్ను విడుదల చేయాలని ఆదేశించింది. ఐహెచ్సీ చీఫ్ జస్టిస్ ఆమిర్ ఫరూఖ్, జస్టిస్ తారిఖ్ మెహమూద్ జహంగీర్తో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఈమేరకు తీర్పు వెలువరించింది. ఇదే విషయాన్ని ఇమ్రాన్ తరపు లాయర్లు కూడా ట్విటర్లో వెల్లడించారు.
తోషాఖానా కేసులో ఇమ్రాన్ను దోషిగా పేర్కొంటూ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి హుమాయున్ దిలావర్ ఈ నెల 5న తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ఆయనకు మూడేండ్ల జైలుశిక్ష విధించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీచేయకుండా ఆదేశాలు జారీచేశారు. దీంతో డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పును ఇమ్రాన్.. ఐహెచ్సీలో సవాలు చేశారు. ఈ నెల 22న తోషాఖానా కేసుపై ఐహెచ్సీ మరోసారి విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్నాక.. ఇమ్రాన్ను దోషిగా తేల్చేందుకు తగిన సాక్ష్యాధారాలులేవని మంగళవారం తీర్పు వెలువరించింది. కాగా, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ రూల్స్ ఉల్లంఘించిన కేసులో ఇమ్రాన్ను జైల్లోనే ఉంచాలని స్పెషల్ కోర్టు మంగళవారం ఆర్డర్ వేసింది. బుధవారం ఆయనను విచారణకు తీసుకురావాలని ఆదేశించింది.
ఏమిటీ తోషాఖానా కేసు?
పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్కు పలు దేశాల నుంచి కానుకలు అందాయి. వాటి విలువ రూ.14 కోట్లు. వాటిని ఆయన తన వద్దే ఉంచుకున్నారు. కొన్నింటిని అధిక ధరకు అమ్ముకున్నారు. తోషాఖానా నిబంధనల ప్రకారం గిఫ్టుల వివరాలను క్యాబినెట్ డివిజన్కు తెలియజేయాలి. కానీ, ఇమ్రాన్ ఆ వివరాలను దాచిపెట్టారు.