సిద్ధరామయ్యే సీఎం

సిద్ధరామయ్యే సీఎం

సిద్ధరామయ్యే సీఎం
డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్
ప్రకటించిన కాంగ్రెస్​ హైకమాండ్​
5 రోజుల ఉత్కంఠకు సోనియాగాంధీ చొరవతో తెర
రేపు మధ్యాహ్నం కొలువుదీరనున్న కర్నాటక కొత్త కేబినెట్

కర్నాటక సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్​కు తెరపడింది. మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్​ డీకే శివకుమార్ మధ్య ఎట్టకేలకు రాజీ కుదిరింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను, డిప్యూటీ సీఎంగా శివకుమార్​ను కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. బుధవారం అర్ధరాత్రి దాకా సందిగ్ధత కొనసాగగా.. కాంగ్రెస్ మాజీ చీఫ్​ సోనియా గాంధీ చొరవతో సమస్య కొలిక్కి వచ్చింది. పార్టీ హైకమాండ్​ నిర్ణయానికి డీకే శివకుమార్​ తలొగ్గారు. శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో సీఎం, డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం జరుగనుంది. ముఖ్యమంత్రి పదవిని సిద్ధరామయ్య రెండున్నరేండ్లు, ఆ తర్వాత శివకుమార్ రెండున్నరేండ్లు పంచుకునే అవకాశం ఉందని కాంగ్రెస్​ వర్గాలు చెప్తున్నాయి. 


    కర్నాటక కాంగ్రెస్ పంచాయితీ ఎట్టకేలకు కొలిక్కి
    పార్టీ హైకమాండ్ నిర్ణయానికి తలొగ్గిన డీకే శివకుమార్ 
    రేపు మధ్యాహ్నమే ప్రమాణం 
    గవర్నర్ ను కలిసిన ఇరువురు నేతలు 

బెంగళూరు : కర్నాటక కాంగ్రెస్ పంచాయితీ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య రాజీ కుదిరింది. ముఖ్యమంత్రిగా సిద్ధూని, డిప్యూటీ సీఎంగా డీకేని కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. బుధవారం రాత్రి దాకా సందిగ్ధత కొనసాగగా.. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ మంత్రాంగంతో 5 రోజుల ఉత్కంఠకు తెరపడింది. అధిష్టానం నిర్ణయానికి డీకే తలవంచగా.. తొలి నుంచి మెట్టుదిగని సిద్ధరామయ్య తన పంతం నెగ్గించుకున్నారు. శనివారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రతిపక్షాల బల ప్రదర్శనలా నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షాలను ఆహ్వానించింది. 

ఐదు రోజులు చర్చోపచర్చలు

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 13న రాగా.. సీఎం పదవి కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పోటీపడ్డారు. దీంతో వ్యవహారం ఢిల్లీకి చేరింది. దాదాపు 5 రోజులు చర్చోపచర్చలు జరిగాయి. బుధవారం రాత్రి పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్, రణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్ సుర్జేవాలా.. ఇద్దరితో మాట్లాడారు. సుదీర్ఘ చర్చల తర్వాత అయిష్టంగానే డిప్యూటీ సీఎం పదవికి డీకే ఒప్పుకున్నారు. ఈ విషయంలో సోనియా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సిద్ధూని సీఎంగా, డీకేని డిప్యూటీగా సోనియానే ఎంపిక చేసినట్లు చెప్పాయి. బుధవారం రాత్రి డీకేతో సోనియా మాట్లాడారని వెల్లడించాయి. దీంతో ఆయన త్యాగం చేయాల్సి వచ్చిందని, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా వెనక్కి తగ్గాల్సి వచ్చిందని డీకే సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

పీసీసీ పగ్గాలు డీకే చేతిలోనే

సీఎంగా సిద్ధరామయ్య పేరు ఖరారైనట్లు గురువారం ఉదయాన్నే వార్తలు బయటికి వచ్చాయి. అధికారిక ప్రకటన రాకముందే మైసూరు జిల్లాలోని సిద్ధరామయ్య సొంతూరు సిద్ధరామనహండిలో వేడుకలు మిన్నంటాయి. క్రాకర్లు పేలుస్తూ.. స్వీట్లు పంచారు. మధ్యాహ్నం సమయంలో ఢిల్లీలోని కాంగ్రెస్ జాతీయ కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాతో మాట్లాడారు. సీఎంగా సిద్ధూని, డిప్యూటీ సీఎంగా డీకేని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల దాకా కేపీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డీకే శివ కుమార్ కొనసాగుతారని తెలిపారు. కర్నాటక ప్రభుత్వంలో డీకే ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారని తెలిపారు. గురువారం ఉదయం కేసీ వేణుగోపాల్, రణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్ సుర్జేవాలాతో సిద్ధరామయ్య, శివకుమార్ బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. మరోవైపు సీఎం పదవిపై ఓ ఏకాభిప్రాయం వచ్చాక.. ఖర్గేని సిద్ధూ, డీకే కలిశారు. ‘‘కర్నాటక ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం విషయంలో టీమ్ కాంగ్రెస్ కట్టుబడి ఉంది. మేం 6.5 కోట్ల మంది కన్నడిగులకు చేసిన 5 హామీలను అమలు చేస్తాం’’ అని ఖర్గే ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఖర్గే పోస్ట్ చేశారు. ‘కలిసి ఉంటే బలం’ అని క్యాప్షన్ ఇస్తూ ఇదే ఫొటోను కాంగ్రెస్ కూడా షేర్ చేసింది.

రేపు ప్రమాణ స్వీకారం

గురువారం రాత్రి 7 గంటలకు బెంగళూరులో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎల్పీ నేతగా సిద్ధరామయ్యను ఎన్నుకున్నారు. అంతకుముందు క్వీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డులోని ఇందిరా గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే కార్యక్రమానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు రావాల్సిందిగా పీసీసీ చీఫ్ హోదాలో డీకే శివకుమార్ సూచించారు. గురువారం రాత్రి సీఎల్పీ సమావేశం అనంతరం బెంగళూరులోని రాజ్ భవన్ లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను సిద్ధూ, డీకే, ఇతర పార్టీనేతల బృందం కలిసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరింది. ఇక శనివారం మధ్యాహ్నం 12.30కి కంఠీరవ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధూ కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 20 నుంచి 25 మంది దాకా మంత్రులు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

డిప్యూటీ పదవితో హ్యాపీగా లేం: డీకే బ్రదర్

తన సోదరుడికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంపై తాము సంతోషంగా లేమని డీకే శివ కుమార్ సోదరుడు, ఎంపీ డీకే సురేశ్ అన్నారు. సీఎం పోస్టు వస్తుందని ఆశించామని చెప్పారు. అయితే కర్నాటక ప్రయోజనాల దృష్ట్యా తన సోదరుడు డిప్యూటీ సీఎం పదవికి ఒప్పుకున్నారని, అయినప్పటికీ తాము వేచి చూస్తామని అన్నారు.

సిద్ధరామయ్యకు కలిసొచ్చిన అంశాలివే

ప్రభుత్వాన్ని నడపడంలో అనుభవం, రాష్ట్రవ్యాప్తంగా మాస్ ఫాలోయింగ్ ఉండటం వంటి అంశాలు సీఎం రేసులో సిద్ధరామయ్యకు కలిసి వచ్చాయి. ఓబీసీలు, ఎస్సీలు, ముస్లింల ఆదరణ ఉన్న నేత కావడం, 2024 లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సిద్ధరామయ్య వైపు కాంగ్రెస్ మొగ్గింది. ‘‘రాష్ట్ర నాయకుల్లో అత్యంత పాపులారిటీ ఉన్న నేత సిద్ధరామయ్య. ఓట్లను రాబట్టుకోవడంతో ఆయన సామర్థ్యాలను పార్టీ విస్మరించలేదు. వచ్చే లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని పార్టీ ఎదురు చూస్తోంది’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అన్నారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యులు సిద్ధూ వైపే నిలిచారు. పార్టీ సీక్రెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఆయనకే ఓటు వేశారు. పార్టీలోని చాలా మంది నేతలు కూడా ఎన్నికలకుముందే ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఓ జాతీయ న్యూస్ చానల్ నిర్వహించిన సర్వేలోనూ సిద్ధూ పేరే ఎక్కువ మంది చెప్పారు. 

అధిష్టానం నిర్ణయం.. కోర్టు తీర్పులాంటిదే: డీకే శివకుమార్

‘‘సీఎం ఎంపిక విషయాన్ని హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే వదిలేస్తామని చెప్పినప్పుడు.. వాళ్లు తీసుకునే నిర్ణయం ఏదైనా అంగీకరించాల్సిందే. ఇది తీర్పు. మనలో చాలా మంది కోర్టులో వాదిస్తూ ఉంటారు. అంతిమంగా.. న్యాయమూర్తి చెప్పిన దాన్ని అంగీకరించి తీరాల్సిందే’’ అని డీకే శివకుమార్ చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాలు తర్వాత అని, పార్టీ ప్రయోజనాలే ముందని, అదే తన కమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అని అన్నారు. ‘‘ఒకవేళ మేం గెలవకపోయుంటే పరిస్థితేంటి? మేం గెలిచాం.. దాని ఫలాన్ని పొందాలి. నేనే కాదు.. లక్షలాది మంది కార్యకర్తలు పని చేశారు. మేం వాళ్ల వైపు నుంచి కూడా ఆలోచించాలి” అని తెలిపారు. వివాదాన్ని ముగించేందుకు సోనియా గాంధీ జోక్యం చేసుకున్నారా? అని ప్రశ్నించగా.. ‘‘ఈ విషయంలోకి సోనియాను కానీ, గాంధీ ఫ్యామిలీని కానీ తీసుకురావడం నాకు ఇష్టం లేదు. నేను కేవలం రాహుల్, ఖర్గే, ఏఐసీసీ ఆఫీస్ బేరర్లను కలిశాను అంతే” అని చెప్పారు.

ప్రతిపక్ష సీఎంలకు ఆహ్వానం

సిద్ధరామయ్య ప్రమాణస్వీకారానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల నేతలను కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆహ్వానించారు. బీహార్ సీఎం, నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఎన్సీపీ చీఫ్ పవా ర్, బెంగాల్ సీఎం మమత, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, సీపీఐ నేత డీ రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరి, మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే, తెలంగాణ సీఎం కేసీఆర్ తది తర నేతలకు ఇన్విటేషన్ పంపారు.


దళితుడిని డిప్యూటీ సీఎం చేయకుంటే కాంగ్రెస్ కు కష్టాలు తప్పవ్: పరమేశ్వర

దళితుడికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ కు కష్టాలు తప్పవని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం జి. పరమేశ్వర హెచ్చరించారు.  అధిష్టానం నిర్ణయం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందన్నారు. కర్నాటకలో దళిత కమ్యూనిటీకి చెందిన కీలక నేతగా పరమేశ్వర ఉన్నారు. అయితే, ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉండాలని పార్టీ హైకమాండ్ కు డీకే షరతు పెట్టారన్న విషయంపై స్పందిస్తూ ఆయన ఈ మేరకు బదులిచ్చారు. తాను సీఎం, డిప్యూటీ సీఎం పదవుల్లో ఏదో ఒకటి వస్తుందని ఆశించానన్నారు. 

50:50 షేరింగ్ ఉండొచ్చట!

50:50 పవర్ షేరింగ్ విషయంలో రఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఓ అవగాహనకు వచ్చినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి పదవిని సిద్ధ రామయ్య, శివకుమార్.. చెరో రెండున్నరేళ్లు పంచుకుంటారని, సిద్ధూ తర్వాత డీకే సీఎంగా బాధ్యతలు చేపడుతారని వెల్లడిం చాయి. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే ఫలితాల ఆధారంగానే ఏ నిర్ణయమైనా ఉంటుందని చెప్పాయి.