పోటాపోటీ నిరసనలు
రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్..
వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ ఆందోళనలు
దిష్టిబొమ్మల దహనాలు, విమర్శలు
హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్.. నరకం చూసిన నగరవాసులు
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పోటాపోటీ నిరసనలతో హోరెత్తించారు. వ్యవసాయానికి మూడుగంటలే ఫ్రీ కరెంట్చాలు అంటూ రేవంత్ కామెంట్లు చేశారని, ఫ్రీ కరెంట్ను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నదని ఆరోపిస్తూ బుధవారం అధికార పార్టీ నేతలు రోడ్ల మీదికి వచ్చారు. హైదరాబాద్లోని విద్యుత్ సౌధ వద్ద ఎమ్మెల్సీ కవిత కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు. రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.
విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ఆందోళనకు దిగారు. ఇటు బీఆర్ఎస్ నేతలు.. రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేయగా, అటు కాంగ్రెస్ నేతలు.. కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రెండు పార్టీల నేతల ధర్నాలు, రాస్తారోకోలతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా ఉదయం హైదరాబాద్లోని విద్యుత్ సౌధ వద్ద కవిత ఆందోళనతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు తిప్పలు పడ్డారు. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయి నరకం అనుభవించారు.