- పవర్ప్లేలో బ్యాటర్ల తీరుపై విమర్శలు
- ద్రవిడ్ కోచింగ్ శైలిపై కూడా..
వెలుగు స్పోర్ట్స్ డెస్క్ : 2013 చాంపియన్స్ ట్రోఫీ.. ఇండియా టీమ్ గెలిచిన చివరి ఐసీసీ టైటిల్ ఇది. అప్పట్నించి ఇప్పటిదాకా.. ఎంతో మంది ప్లేయర్లు మారారు.. కెప్టెన్లు మారారు.. కోచ్లూ మారారు. కానీ గత 8 ఏళ్లలో 7 ఐసీసీ టోర్నీలు ఆడితే.. ఒక్కదాంట్లోనూ టైటిల్ నెగ్గలేదు. ప్రపంచ స్థాయి ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా.. స్ట్రాటజీలను పక్కాగా రచించి అమలు చేసే సత్తా ఉన్నా.. తాజాగా టీ20 వరల్డ్కప్ కూడా అందకుండానే దూరమైపోయింది. ఓవరాల్గా మెగా టోర్నీకి ముందు ఫేవరెట్ ట్యాగ్తో బరిలోకి దిగిన టీమిండియా.. నెల తిరగకముందే ‘న్యూ చోకర్స్’గా ముద్ర వేసుకుంటున్నది. మొత్తానికి గ్లోబల్ టోర్నీలో గత 9 ఏళ్లలో ఆరో నాకౌట్ ఓటమికి కారణాలేంటో చూద్దాం.
బుమ్రా, జడేజా లేకపోవడం లోటు..
వరల్డ్కప్కు ముందే బుమ్రా, జడేజా లేకపోవడం పెద్ద ఎదురుదెబ్బ. బుమ్రా గైర్హాజరీతో డెత్ ఓవర్లలో మనం ఎంత బలహీనంగా ఉన్నామో తొలి మ్యాచ్లోనే స్పష్టమైంది. జడేజా కంప్లీట్ ఆల్రౌండర్. బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి, ముందుకు ఆడించే చాన్స్తో పాటు లెఫ్ట్యాండర్ కావడం అతిపెద్ద బలం. టాప్ స్పిన్నర్గా 4 ఓవర్ల కోటాను వేసే సామర్థ్యం ఉన్న బౌలర్. ఈ ఇద్దరు లేకపోవడంతో టీమ్ తుది కూర్పు బాగా దెబ్బతిన్నది.
పవర్ప్లేలో అతి జాగ్రత్త
టీ20ల్లో భారీ స్కోరు చేయాలన్నా.. టార్గెట్ను ఛేదించాలన్నా పవర్ప్లే అత్యంత ప్రధానమైంది. రోహిత్, రాహుల్, కోహ్లీ పవర్ప్లేలో అతి జాగ్రత్తగా ఆడటం బ్యాక్ఫైర్ అయ్యింది. ఒకరు యాంకర్ పాత్ర పోషిస్తే మిగతా ఇద్దరు ఎదురుదాడి చేయాల్సిన టైమ్లో రాహుల్ (128 రన్స్, స్ట్రయిక్ రేట్ 120.75), రోహిత్ (116 రన్స్, స్ట్రయిక్ రేట్ 106.42), కోహ్లీ (స్ట్రయిక్ రేట్ 136.40) డిఫెన్స్కు మొగ్గారు. పేస్కు అనుకూలించే పిచ్లపై సౌతాఫ్రికాపై 33/2, పాక్పై 31/3 స్కోరు చేసినా.. బ్యాటింగ్ పిచ్ అయిన అడిలైడ్లో 38/1 స్కోరు చేయడం క్షమించరాని అంశం. టోర్నీలో ఆడిన 16 టీమ్స్ సగటు పవర్ప్లే రన్ రేట్ 6.02గా ఉంటే ఇండియా 15వ స్థానంలో ఉంది.
చహల్ను పక్కనబెట్టడం
టీ20ల్లో చహల్ టాప్ వికెట్ టేకర్గా ఉన్నాడు. కానీ అతన్ని ఒక్క మ్యాచ్లోనూ ఆడించకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. లెగ్ బ్రేక్, గూగ్లీలు వేయడంలో దిట్ట అయిన చహల్ను కాదని అక్షర్ పటేల్ను అతిగా నమ్మి మోసపోయారు. అక్షర్ వికెట్ టు వికెట్ బౌలింగ్ను హేల్స్, ఇఫ్తికార్ దంచికొట్టారు. ఐదు మ్యాచ్లు ఆడితే చాలా వాటిలో అక్షర్ పూర్తి కోటా కూడా కంప్లీట్ చేయలేదు. ఎకానమీ 8.62గా ఉంది. ఇక బ్యాటర్గా పనికొస్తాడని భావించినా అది కూడా నెరవేరలేదు. హర్షల్, చహల్లో ఏ ఒక్కర్ని ఆడించినా చాలా ప్రయోజనాలు ఉండేవి.
పంత్ X కార్తీక్
సూపర్ ఫినిషర్ కార్తీక్ ఫస్ట్ మ్యాచ్లోనే తేలిపోయాడు. దీంతో అతని ప్లేస్లో పంత్ను ఆడించకపోవడం పెద్ద తప్పు. రన్స్ చేయకపోయినా పంత్ తన అటాకింగ్తో బౌలర్లను ఒత్తిడిలోకి నెడతాడు. ఉపఖండం పిచ్లపై 10 బాల్స్లో 20, 30 రన్స్ కొట్టాలంటే కార్తీక్ను ఆడించొచ్చు. కానీ ఎక్స్ట్రా బౌన్స్తో ఉండే ఫారిన్ పిచ్లపై అతనికి ఇది సాధ్యం కాదు. టోర్నీ కోసం 4 నెలల నుంచి సిద్ధమయ్యాడు అనుకున్నా.. కనీసం పంత్ను రాహుల్ ప్లేస్లో ఓపెనర్గా పంపించాల్సింది.
ధైర్యం లేని ద్రవిడ్
వరల్డ్కప్ చాలా మ్యాచ్ల్లో ఒకే ఫైనల్ ఎలెవన్ను ఆడించడం కూడా ద్రవిడ్ బలహీనతను బహిర్గతం చేసింది. అతను రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతోనే పంత్, పటేల్, చహల్ను బెంచ్కు పరిమితం చేశాడన్న విమర్శలు వస్తున్నాయి. పవర్ప్లేలో రన్స్ రావడం లేదని గుర్తించినా బ్యాటర్లలో మార్పు తీసుకురాలేదు. తన కాలం నాటి పాత టెక్నిక్ను కొనసాగించడంతో ఏకంగా వరల్డ్కప్పే దూరమైంది.
ద్రవిడ్కు రెస్ట్ కివీస్ టూర్కు కోచ్గా లక్ష్మణ్
అడిలైడ్: టీ20 వరల్డ్కప్లో నిరాశపర్చిన టీమిండియా.. న్యూజిలాండ్ టూర్ కోసం రెడీ అవుతోంది. ఇందులో భాగంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో సహా సపోర్ట్ స్టాఫ్కు రెస్ట్ ఇవ్వగా, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నెల 18న వెల్లింగ్టన్లో మొదలయ్యే ఈ టూర్లో ఇండియా.. కివీస్తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. సీనియర్ ప్లేయర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, స్పిన్నర్ అశ్విన్కు విశ్రాంతి ఇచ్చారు. లక్ష్మణ్తో పాటు హృశికేష్ కనిత్కర్ (బ్యాటింగ్ కోచ్), సాయిరాజ్ బహుతులే (బౌలింగ్ కోచ్).. కివీస్లో టీమ్తో పాటు జాయిన్ అవుతారని బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు.