
గొప్ప గొప్ప విజయాలు సాధించడమే కాదు.. గొప్ప మనసును చాటుకున్నప్పుడే అసలైన విజయం. పోలెండ్కు చెందిన ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ మరియా ఆండ్రేజెక్ ఇలాంటి గొప్ప పనే చేసింది. తనకు వచ్చిన రజత పతకాన్ని వేలం వేసి వచ్చిన డబ్బు ఓ పిల్లాడి హార్ట్ సర్జరీకి ఇచ్చింది. మరియా జావెలిన్ త్రో రజతం సాధించింది. పతకం గెలిచిన కొన్ని రోజుల తర్వాత ఆమె మనసును ఓ వార్త కలచి వేసింది. ఎనిమిది నెలలున్న మిలోజెక్ అనే అబ్బాయి గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. అతనికి వెంటనే సర్జరీ చేయాలి. పేరెంట్స్ దగ్గర డబ్బు లేదు. విషయం తెలుసుకున్న మరియా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అనుకుంది. వెంటనే ఫండ్ రైజింగ్ క్యాంపెయినింగ్ను మొదలు పెట్టింది. ‘నాకు ఆలోచించడానికి ఎక్కువ టైం లేదు. నేను మొదటిసారిగా ఫండ్ రైజ్ చేయాలనుకుంటున్నా’ అని తన ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆపై తన ఒలింపిక్ మెడల్ను కూడా వేలం వేసి వచ్చిన డబ్బును ఆ పిల్లగాడికి ఇవ్వాలని నిర్ణయించుకుంది. మరియా వేస్తున్న మెడల్ వేలం గురించి పోలెండ్లోని జబ్కా పోల్స్కా కంపెనీ తెలుసుకుంది. తొంభై మూడు లక్షలు ఇచ్చి, మెడల్ను కొనుగోలు చేసింది. అయితే.. మరియా మంచి మనసుకు బహుమతిగా తిరిగి ఆ మెడల్ను ఆమెకే బహూకరించింది ఆ కంపెనీ. ‘మెడల్ అనేది విలువైందే.. కానీ దానికి నిజమైన విలువ, అది ఎవరికైనా ఉపయోగపడినప్పుడే వస్తుంది. అందుకే దీన్ని వేలం వేయాలని భావించా. ఇప్పుడు ఈ మెడల్ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతుంది’ అంటూ మరోసారి మరియా తన ఫీలింగ్ షేర్ చేసుకుంది.