పతకం డబ్బులతో సర్జరీ చేయించింది

పతకం డబ్బులతో  సర్జరీ చేయించింది

గొప్ప గొప్ప విజయాలు సాధించడమే కాదు.. గొప్ప మనసును చాటుకున్నప్పుడే అసలైన విజయం.  పోలెండ్​కు చెందిన ఒలింపిక్​ సిల్వర్​ మెడలిస్ట్​ ​ మరియా ఆండ్రేజెక్ ఇలాంటి గొప్ప పనే చేసింది. తనకు వచ్చిన రజత పతకాన్ని వేలం వేసి వచ్చిన డబ్బు ఓ పిల్లాడి హార్ట్​ సర్జరీకి ఇచ్చింది. మరియా జావెలిన్​ త్రో రజతం సాధించింది. పతకం గెలిచిన కొన్ని రోజుల తర్వాత ఆమె మనసును ఓ వార్త కలచి వేసింది. ఎనిమిది నెలలున్న మిలోజెక్​ అనే అబ్బాయి గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. అతనికి వెంటనే సర్జరీ చేయాలి. పేరెంట్స్​ దగ్గర డబ్బు లేదు. విషయం తెలుసుకున్న మరియా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అనుకుంది. వెంటనే ఫండ్​ రైజింగ్​ క్యాంపెయినింగ్​ను మొదలు పెట్టింది. ‘నాకు ఆలోచించడానికి ఎక్కువ టైం లేదు. నేను మొదటిసారిగా ఫండ్ రైజ్ చేయాలనుకుంటున్నా’ అని తన ఫేస్​బుక్​, ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. ఆపై తన ఒలింపిక్​ మెడల్​ను కూడా వేలం వేసి వచ్చిన డబ్బును ఆ పిల్లగాడికి ఇవ్వాలని నిర్ణయించుకుంది. మరియా వేస్తున్న మెడల్​ వేలం గురించి పోలెండ్​లోని జబ్కా పోల్స్‌‌‌‌కా కంపెనీ తెలుసుకుంది.  తొంభై మూడు లక్షలు ఇచ్చి, మెడల్‌‌‌‌ను కొనుగోలు చేసింది. అయితే.. మరియా మంచి మనసుకు బహుమతిగా తిరిగి ఆ మెడల్‌‌‌‌ను ఆమెకే బహూకరించింది ఆ కంపెనీ. ‘మెడల్ అనేది విలువైందే.. కానీ దానికి నిజమైన విలువ, అది ఎవరికైనా ఉపయోగపడినప్పుడే వస్తుంది. అందుకే దీన్ని వేలం వేయాలని భావించా. ఇప్పుడు ఈ మెడల్ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతుంది’ అంటూ మరోసారి మరియా తన ఫీలింగ్​  షేర్​ చేసుకుంది.