
- కారులో అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
సికింద్రాబాద్, వెలుగు : కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.2 కోట్ల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను నార్త్జోన్ టాస్క్ ఫోర్స్పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ పోలీసులతో కలిసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్టుగూడకు చెందిన బజ్జూరి పూర్ణచందర్(49), వరంగల్కు చెందిన సయ్యద్ బాబా షరీఫ్(25) కారులో బంగారు, వెండి ఆభరణాలు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం మెట్టుగూడలో వెహికల్స్ తనిఖీ చేపట్టగా, అదే టైంలో పూర్ణచందర్, బాబా షరీఫ్ కారులో అటుగా వచ్చారు. ఆపి తనిఖీ చేయగా, రెండు బాక్సుల్లో 2.5 కిలోల బంగారం, వజ్రాలతో పొదిగిన ఆభరణాలు, కిలో వెండి ఆభరణాలు లభించాయి. ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.