
హైదరాబాద్, వెలుగు: కరోనా టెస్టులు చేసుకోవడం పెద్ద సమస్యగా మారిన ఈ టైంలో హైదరాబాద్లోని లుసిడ్ ల్యాబ్ కొత్త పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది. వందల మంది కరోనా అనుమానితుల మధ్యలో లైన్లో నిల్చొని, గంటలపాటు వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేకుండా.. పేషెంట్ వచ్చిన వెహికల్ దగ్గరికే వెళ్లి శాంపిల్ సేకరించేందుకు ‘డ్రైవ్ టెస్ట్’ మెథడ్ను అమలు చేస్తోంది. శాంపిల్ తీసుకున్న రెండుమూడు గంటల్లోనే రిజల్ట్ ఇస్తున్నారు. గరిష్టంగా ఆరు గంటలు దాటకుండా రిజల్ట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో టెస్టు కోసం రూ. 2,700 రేట్ ఉంది. ‘‘చాలా మంది భయపడి కరోనా టెస్టులు చేసుకోవడంలేదు. ల్యాబ్ దగ్గరికి వస్తే అక్కడ ఉండే అనుమానితులతో వైరస్ సోకుతుందనే భయం వారిలో ఉంటోంది. ఈ టెన్షన్ ఉండకుండా డ్రైవ్ టెస్ట్ పద్ధతిని మొదలుపెట్టాం. ఎవరైనా కారులోగానీ, ఇతర వెహికల్లోగానీ వస్తే… వారి దగ్గరికే ల్యాబ్ స్టాఫ్ వచ్చి శాంపిల్స్ సేకరిస్తారు’’అని లుసిడ్ హైదరాబాద్ మేనేజర్ హేమచంద్ర చెప్పారు. ప్రభుత్వం ప్రైవేటు ల్యాబ్లకు పర్మిషన్ ఇచ్చినప్పటి నుంచి తమ ల్యాబ్లో టెస్టులు చేస్తున్నామని, ఇటీవలే కొత్త పద్ధతిని మొదలెట్టామన్నారు. దేశంలోనే మొదట గుజరాత్లోని గాంధీనగర్లో ఈ పద్ధతి అమలు చేస్తున్నారని, రెండో నగరం హైదరాబాద్ అని ఆయన చెప్పారు.