సూప‌ర్ పోలీస్: అన్నీ తానై అంత్య‌క్రియ‌లు చేశాడు

 సూప‌ర్ పోలీస్: అన్నీ తానై అంత్య‌క్రియ‌లు చేశాడు

పెద్దపల్లి జిల్లా: క‌రోనా సోకింద‌నే భ‌యంతో ఓ వృద్ధుడు సూసైడ్ చేసుకున్నాడు. అయితే అత‌డికి కోవిడ్ పాజిటివ్ ఉంద‌ని మృత‌దేహాం ద‌గ్గ‌ర‌కు ఫ్యామిలీ స‌భ్యులు ఎవ్వ‌రూ రాలేదు. స‌మాచారం అందుకున్న ఓ పోలీస్ ఆఫీస‌ర్ అన్నీతానై గౌర‌వంగా అంత్య‌క్రియ‌లు జ‌రిపించాడు. ఈ సంఘ‌ట‌న పెద్ద‌ప‌ల్లి జిల్లాలో జ‌రిగింది. కమాన్ పూర్  పోలీస్ స్టేషన్ పరిధిలోని,  పెంచికల్ పేట గ్రామనికి చెందిన గొడిశెల లింగయ్య (63) అనే రిటైర్డ్ సింగరేణి కార్మికుడికి ఇటీవ‌ల‌ కరోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో కొన్ని రోజులుగా బాధ ప‌డుతున్న లింగ‌య్య‌.. మంగ‌ళ‌వారం ఇంటి పక్కన ఉన్న‌ టేకు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విష‌యం తెలిసిన కుటుంబ స‌భ్యులు  శవం దగ్గరకు రాకుండా పోలీసుల‌కు ఫోన్ చేశారు. వెంట‌నే సంఘటన స్థలానికి వెళ్లిన కమాన్ పూర్ ఎస్సై శ్యాం పటేల్ మృత‌దేహాన్ని పోస్ట్ మార్ట‌మ్ కోసం హాస్పిట‌ల్ కి త‌ర‌లించాడు. శవ పరీక్షలు నిర్వహించిన త‌ర్వాత‌ పార్ధీవ దేహానికి గౌరవంగా అంత్యక్రియలు దగ్గరుండి జరిపించాడు. మాన‌వ‌త్వం చాటుకున్న‌ ఎస్సై శ్యాం పటేల్ ను ఉన్న‌తాధికారులు అభినందించారు.