- ఏక్నాథ్ షిండే శిబిరంలో 42 మంది
- 12 మందిపై అనర్హత వేటు వేయాలంటూ డిప్యూటీ స్పీకర్కు శివసేన లేఖ
- 24 గంటల్లో తిరిగి వస్తే ఎంవీఏ నుంచి బయటికొచ్చేందుకు రెడీ: సంజయ్ రౌత్
- ఎంవీఏకు మద్దతు కొనసాగిస్తామన్న కాంగ్రెస్, ఎన్సీపీ
- మెజార్టీ ఎవరిదనేది అసెంబ్లీలోనే తేలుతుంది: పవార్
ముంబై/గౌహతి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. రెబెల్ ఎమ్మెల్యేల బలం రోజురోజుకూ పెరుగుతోంది. కేబినెట్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్య 42కు చేరింది. గురువారం మొత్తం 42 మంది ఎమ్మెల్యేల వీడియోను షిండే మీడియాకు విడుదల చేశారు. అయితే మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)ని కాపాడేందుకు, సీఎం సీటును నిలుపుకునేందుకు ఉద్ధవ్ థాక్రే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రెబెల్ ఎమ్మెల్యేల్లో 12 మందిపై వేటు వేయాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్కు శివసేన లేఖ రాసింది. అధికార ఎంవీఏ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమని, కానీ రెబెల్ ఎమ్మెల్యేలు 24 గంటల్లో గౌహతిని వీడి ముంబై చేరుకోవాలని శివసేన ఎంపీ సంజయ్రౌత్ చెప్పారు. తిరిగి వస్తే వారి డిమాండ్లపై సీఎం ఉద్ధవ్తో చర్చిద్దామన్నారు. అయితే ఎంవీఏ పూర్తి కాలం కొనసాగాలని తాము కోరుకుంటున్నామని, ఉద్ధవ్కు తమ మద్దతు కొనసాగుతుందని ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రకటించాయి. నాలుగు రోజుల క్రితం ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో ఎంవీఏ సర్కారులో అసమ్మతి రాజుకున్న సంగతి తెలిసిందే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల ఎంవీఏ కూటమి నుంచి శివసేన బయటకు రావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
తొలుత గుజరాత్లోని సూరత్లో క్యాంప్ వేసిన రెబెల్ లీడర్లు ఆ తర్వాత తమ మకాంను బీజేపీ పాలిత రాష్ట్రమే అయిన అస్సాంలోని గౌహతీకి మార్చారు.
తలుపులు తెరిచే ఉన్నా యి
శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే దాదాపు పార్టీపై పట్టుకోల్పోయినట్టే కనిపిస్తోంది. రెబెల్ ఎమ్మెల్యేల బలం పెరుగుతోంటే.. ఉద్ధవ్కు సపోర్ట్గా ఉన్న వారి సంఖ్య తగ్గిపోతోంది. గురువారం ఉద్ధవ్ ఏర్పాటు చేసిన సమావేశానికి 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ముంబై నుంచి గౌహతీకి చేరుకున్నట్టు తెలిసింది. మరోవైపు ఎమ్మెల్యేలకు తోడు కొందరు శివసేన ఎంపీలు కూడా రెబెల్ క్యాంపులోకి చేరినట్టు వార్తలు వస్తున్నాయి. శివసేనకు లోక్సభలో 19 మంది, రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వీరిలో పది మందికిపైగా రెబెల్ క్యాంపులోకి చేరారని, కొందరు గౌహతీలో ఉన్నట్టు సమాచారం. అయితే రెబెల్ ఎమ్మెల్యేలకు పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని, వారు లేవనెత్తిన అంశాన్నింటిని చర్చల ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని సంజయ్ రౌత్ చెప్పారు. కాగా, రెబెల్ క్యాంపును బుజ్జగిస్తూనే వారిని కట్టడి చేసేందుకు ఉద్ధవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా 12 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్కు శివసేన పిటిషన్ ఇచ్చింది. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన గ్రూప్ లీడర్గా షిండే స్థానంలో అజయ్ చౌదరి నియామకానికి డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ ఆమోదముద్ర వేశారు.
42కు చేరిన రెబెల్స్ బలం
ప్రస్తుతం షిండే క్యాంపులో 37 మంది రెబెల్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ఇద్దరు ఈ క్యాంపులో చేరడంతో వీరి బలం 39కి చేరింది. ఫిరాయింపుల నిరోధక చట్టానికి భంగం కలగకుండా పార్టీని చీల్చేందుకు కావాల్సిన బలం ఇప్పుడు షిండే క్యాంపునకు ఉన్నట్టే. ఇండిపెండెంట్లను కలుపుకుంటే వీరి బలం 42కు చేరింది. మరోవైపు సీఎం ఉద్ధవ్ను కలిసేందుకు తమకు అవకాశమే దక్కడం లేదని, రెండున్నరేండ్లుగా సీఎం ఇంట్లోకి తమకు ఎంట్రీయే ఇవ్వలేదని రెబెల్ ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ ట్విట్టర్లో ఆరోపించారు. తాము ఉద్ధవ్ రాజీనామా చేయాలని కోరుకుకోవడం లేదని, కాంగ్రెస్, ఎన్సీపీని వదిలి.. బీజేపీతో జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే చాలని రెబెల్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. శివసేన ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారంటూ ఆ పార్టీ నేతలు కామెంట్లు చేయడంతో రెబెల్ ఎమ్మెల్యేలు కొన్ని ఫొటోలు రిలీజ్ చేశారు. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, అందరూ స్వచ్ఛందంగానే వచ్చారంటూ వారు విమానంలో ఉన్న ఫొటోలను షిండే క్యాంపు విడుదల చేసింది.
మద్దతు కొనసాగిస్తాం: కాంగ్రెస్, ఎన్సీపీ..
మాకు సంబంధం లేదు: బీజేపీ
వరుస సమావేశాల తర్వాత ఉద్ధవ్ థాక్రేకు తమ మద్దతు కొనసాగిస్తామని కాంగ్రెస్, ఎన్సీపీ ప్రకటించాయి. తాము కలిసే పోరాటం చేస్తామని, ఎంవీఏ కలిసే ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. ఎంవీఏ సంక్షోభం నుంచి బయటపడుతుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చెప్పారు. ఎవరి బలం ఎంతనేది అసెంబ్లీలో తేలుతుందన్నారు. సూరత్, గౌహతీలో కూర్చుని ఎవరు ఎన్నైనా చెప్పవచ్చని, ముంబై వస్తేనే అసలు పరిస్థితులు ఏమిటో తెలుస్తాయన్నారు. ఉద్ధవ్కు తాము మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. మరోవైపు మహారాష్ట్ర సంక్షోభంతో తమకు సంబంధం లేదని, తాము ఆపరేషన్ లోటస్ చేపట్టామన్న వార్తలు అవాస్తవమని బీజేపీ ప్రకటించింది. అయితే అస్సాంలో శివసేన రెబెల్ ఎమ్మెల్యేలతో బీజేపీ మినిస్టర్ ఒకరు ఉన్నట్టు వీడియోలో స్పష్టమైంది. అలాగే శివసేన ఎమ్మెల్యేలు అస్సాం రావడానికి ముందు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ హోటల్ లో కనిపించారు.
ఎన్సీపీ, కాంగ్రెస్తో బంధం తెంచుకుంటేనే
తన బలాన్ని నిరూపించుకుంటూ షిండే ఒక వీడియో రిలీజ్ చేశారు. హిందూత్వ సిద్ధాంతాలను కాంగ్రెస్, ఎన్సీపీ కాలరాస్తున్నాయని, గత రెండున్నర సంవత్సరాలుగా పార్టీ లీడర్లు ఎన్నో కష్టాలు అనుభవించారని ఆయన చెప్పారు. ఎన్సీపీ, కాంగ్రెస్తో బంధం తెంచుకుంటేనే చర్చలు జరుపుతామని ప్రకటించారు. గ్రూప్ లీడర్గా తమ తరపున షిండే నిర్ణయం తీసుకుంటారని ఈ వీడియోలో రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించారు.
12 మందిపై అనర్హత వేటు వేయండి
12 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్కు శివసేన పిటిషన్ ఇచ్చింది. ఈ జాబితాలో రెబెల్ లీడర్ ఏక్నాథ్షిండే పేరు కూడా ఉంది. ఈ లిస్ట్లో ఏక్నాథ్షిండేతో పాటు సంజయ్ శిర్సాత్, సందీపన్ భుమ్రే, తానాజీ సావంత్, భరత్ గోగావాలె, అబ్దుల్ సత్తార్, లతా సోనావానే, యామినీ జాదవ్, ప్రకాశ్ సర్వే, అనిల్ బాబర్, బాలాజీ కిన్నికర్, మహేశ్ షిండే పేర్లు ఉన్నాయి. అయితే తమకు చట్టం తెలుసని, అనర్హత వేటు వేస్తామని భయపెడితే బెదిరేది లేదని ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. తమ హక్కుల కోసమే తిరుగుబాటు చేశామని చెప్పారు.