
ప్రత్యర్థిని కేసులో ఇరికించడం కోసం తనపై తానే ఎటాక్ చేయించుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో జరిగింది. ఈ ఫేక్ దాడిలో గోండాలోని రామ్ జానకి ఆలయానికి చెందిన పూజారి సామ్రాత్ దాస్ గాయపడ్డారు. తిర్రే మనోరమ గ్రామంలో రామ్ జంకి ఆలయానికి సంబంధించి 120 బిగ్హాల భూమి ఉంది. ఆ భూమి విషయంలో మాజీ గ్రామ అధిపతి అమర్ సింగ్, ప్రస్తుత గ్రామ అధిపతి మహంత్ సీతారామ్దాస్ల మధ్య వైరం నడుస్తోంది. అంతేకాకుండా గ్రామ ప్రధాన్ వినయ్ సింగ్కు కూడా అమర్ సింగ్తో రాజకీయ వైరం ఉంది. దాంతో ఎలాగైనా అమర్ సింగ్ను కేసులో ఇరికించాలని వీరంతా నిర్ణయించుకున్నారు.
అందుకోసం కిరాయి మనుషులతో తమపై తామే దాడి చేయించుకొని.. ఆ దాడిని అమర్ సింగ్ మీద వేయాలని పథకం రచించారు. అందులో భాగంగా కిరాయి మనుషులు పూజారి సామ్రాత్ దాస్పై అక్టోబర్ 10 రాత్రి సమయంలో కాల్పులు జరిపారు. గాయపడ్డ పూజారిని వెంటనే లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. పథకంలో భాగంగా.. మహంత్ సీతారామ్దాస్ వెంటనే అమర్ సింగ్తో పాటు మరో నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
పోలీసు సూపరింటెండెంట్ శైలేష్ కుమార్ పాండే మాట్లాడుతూ.. ‘కేసు దర్యాప్తులో భాగంగా పలువురు సాక్షుల వాంగ్మూలాలను మరియు ఎలక్ట్రానిక్ ఆధారాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఇది పూర్తి ప్రణాళికతో చేసిన కుట్ర అని తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేశాం. మహంత్ సీతారామ్దాస్ ఫిర్యాదు ఆధారంగా అరెస్ట్ చేసిన వారిని త్వరలోనే విడుదల చేస్తాం. కుట్రకు ప్లాన్ చేసిన వారి నుంచి మూడు దేశీయ రివాల్వర్లు స్వాధీనం చేసుకున్నాం ’ అని ఆయన తెలిపారు.
For More News..