
- ట్రంప్ వాడే విమానాలు, కార్లపై ఎక్కడ చూసినా చర్చ
- అతిథి సత్కారానికి సర్కారు అద్భుతమైన ఏర్పాట్లు
- లక్షలాది మందితో ఆహ్వానించేందుకు ప్లాన్
- వందలాది కోట్లతో డెవలప్మెంట్ పనులు
- భోజనం కోసం బంగారు, వెండి పాత్రలు సిద్ధం
- ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ దాకా సెక్యూరిటీ కట్టుదిట్టం
- కోతులు రాకుండా కొండెంగలతో ఆగ్రాలో బందోబస్తు!!
- రేపు అహ్మదాబాద్లో అడుగుపెట్టనున్న డొనాల్డ్ ట్రంప్
- ‘ట్రేడ్ డీల్’పై వ్యాపార వర్గాల చూపు
- ట్రంప్తో విందుకు సీఎం కేసీఆర్కు ఆహ్వానం
న్యూఢిల్లీ: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పర్యటనపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆయన వాడే విమానాలు, కార్ల నుంచి.. ఎక్కడెక్కడికి వెళ్తారు.. ‘నమస్తే ట్రంప్’లో ఏం మాట్లాడతరానే దానిపై చర్చ జరుగుతోంది. ట్రంప్ టూర్ కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. వందలాది కోట్లతో పను లు చేపట్టింది. లక్షల మందితో ఆహ్వానం పలికేందుకు ప్లాన్ చేసింది. భోజనానికి బంగారు, వెండి పాత్రలను రెడీ చేసింది. అహ్మదాబాద్లో గోడ కట్టడం విమర్శలకు దారి తీసింది. ప్రభుత్వం అనవసర హడావుడి చేస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
చర్చల మీద చర్చలు
మెగా ట్రేడ్ డీల్ ఖరారు చేసే విషయంలో రెండు దేశాల మధ్య కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదని తెలుస్తోంది. నిజానికి గత ఏడాది సెప్టెంబర్లో అమెరికాలో మోడీ, ట్రంప్ కలిసినప్పుడే ట్రేడ్ డీల్ ఖరారు కావాల్సింది. అయితే ఏకాభిప్రాయం రాకపోవడంతో ఒప్పందం కుదరలేదు. ఈనెలలోనే లిమిటెడ్ ట్రేడ్ డీల్ ఖరారు కావాల్సి ఉంది. కానీ ట్రంప్ దానికి ఒప్పుకోలేదు. ట్రంప్ పర్యటన సందర్భంగా ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు కామర్స్ మంత్రి పియూష్ గోయల్, అమెరికా ట్రేడ్ రెప్రజెంటేటివ్ రాబర్ట్ లైట్థైజర్ మధ్య కొన్ని వారాల కిందట ఫోన్లో చర్చలు జరిగాయి. కానీ ఫైనలైజ్ కాలేదు. ఈ క్రమంలో రెండు దేశాలు కలిసి బ్రహ్మాండమైన ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని ట్రంప్ చెబుతున్నారు. అయితే ‘అమెరికా ఫస్ట్’ అనే సిద్ధాంతంపైనే ఏ డీల్ అయినా కుదుర్చుకుంటామని అంటున్నారు. ఇప్పుడు సరైన డీల్ సెట్ కాకపోతే అమెరికా ప్రెసిడెన్షియిల్ ఎలక్షన్ల తర్వాత కుదుర్చుకుంటామని చెబుతున్నారు.
డీల్కు తొందర లేదు
ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకునే విషయంలో ట్రంప్ లేట్ చేయడానికి కొన్ని కారణాలున్నాయని అనలిస్టులు అంటున్నారు. అమెరికాతో ఓ ఒప్పందం చేసుకునేందుకు చైనా అంగీకరించిందని చెబుతున్నారు. అలాగే 1994లో మెక్సికో, కెనడాతో కుదుర్చుకున్న నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(నఫ్తా)ను రిప్లేస్ చేసేందుకు సిద్ధమైనట్లు భావిస్తున్నారు. మరోవైపు మనోళ్లు కూడా డీల్ విషయంలో తొందర పడటం లేదు. ‘‘ఒప్పందం విషయంలో తొందరపాటు వద్దని ఇండియా, అమెరికా అంగీకరించాయి. భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. రెండు వైపులా ‘గెలుపు’ దక్కినప్పుడే ఒప్పందం కుదురుతుంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ట్రంప్ సెక్యూరిటీలో కొండెంగలు
ట్రంప్ టూర్ నేపథ్యంలో అహ్మదాబాద్, ఆగ్రాలలో వారం ముందు నుంచే హడావిడిగా ఉంది. సెక్యూరిటీ తనిఖీలతో అణువణువూ జల్లెడ పడుతున్నరు. అవును మరి.. అమెరికా ప్రెసిడెంట్ సెక్యూరిటీ ఏర్పాట్లంటే మాటలా? అత్యాధునిక ఆయుధాల నుంచి బాంబులు పడ్డా చెక్కుచెదరని వాహనాలు ఎన్నో ఉంటయ్.. ఇవన్నీ సరే కానీ ఈ లిస్ట్లో ఐదు కొండెంగలు చేరడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ట్రంప్ సెక్యూరిటీకి కొండెంగలు ఏంచేస్తయంటే.. ఆగ్రాలో తాజ్ అందాలను చూస్తున్నపుడు ట్రంప్ దంపతుల దగ్గరికి కోతులు రాకుండా చూసుకుంటయట. ఆగ్రాలో కోతుల బెడద నేపథ్యంలో సెక్యూరిటీ అధికారులు ముందు జాగ్రత్తగా ఈ కొండెంగలను రప్పించారు.
మరో రెండు ఒప్పందాలు!
3 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన రెండు రక్షణ ఒప్పందాలు కుదర్చుకునే అవకాశం ఉంది. ఇండియన్ ఆర్మీ కోసం మరో 6 అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందం జరగొచ్చని ఓ అధికారి చెప్పారు. ఈ డీల్ విలువ 800 మిలియన్ డాలర్లు(రూ.5,751కోట్లు) ఉండొచ్చని అంచనా వేశారు. అలాగే 24 సీహాక్ యాంటీ సబ్మెరైన్ హెలికాప్టర్లు కొనుగోలు చేసేందుకు కేబినెట్ కమిటీ క్లియరెన్స్ ఇచ్చింది. ఇది కూడా ఖరారయ్యే చాన్స్ ఉంది.