
- మైతీ గ్రూప్ లీడర్ అరెస్ట్కు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు
- రోడ్లపైకి భారీగా తరలివచ్చిన జనం
- పెట్రోల్ పోసుకుని అంటించుకుంటామని బెదిరించిన యువకులు
- ఇంఫాల్ సహా ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవలు బంద్
ఇంఫాల్: మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మైతీ తెగకు చెందిన అరంబాయి టెంగోల్ సంస్థ లీడర్ ను, మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్తలు రావడంతో శనివారం రాత్రి ఆ తెగకు చెందిన జనం పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. రోడ్లపై టైర్లు, పాత సామాన్లు వేసి నిప్పు పెట్టారు. ఓ చోట బస్సుకు నిప్పు పెట్టగా.. మరో చోట తుపాకీ కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయి. ఇంఫాల్ లో అనేక మంది యువకులు వంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పు అంటించుకుంటామని బెదిరించారు. తమ లీడర్ ను రిలీజ్ చేయాలంటూ భద్రతా బలగాలతో ఘర్షణకు దిగారు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లా ఖురై లాంలాంగ్ ఏరియాలో ఓ బస్సుకు నిరసనకారులు నిప్పు పెట్టారు.
క్వాకీతెల్ ఏరియాలో తుపాకీ కాల్పుల శబ్దాలు వినపడ్డాయి. తులిహాల్ లోని ఇంఫాల్ ఎయిర్ పోర్టు గేటు వద్ద కూడా నిరసనకారులు గుమిగూడారు. అరెస్ట్ చేసిన మైతీ లీడర్ను రాష్ట్రం నుంచి తరలిస్తున్నారన్న ప్రచారం సాగడంతో వారు రాత్రంతా ఎయిర్ పోర్టు గేటు వద్దే బైఠాయించారు. అనేకచోట్ల పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పలు చోట్ల లాఠీచార్జీలు చేశారు. ఓ చోట జరిగిన లాఠీచార్జీలో ఒకరు మృతిచెందగా, పలువురు గాయపడినట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో రాజధాని నగరం సహా పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, తౌబల్, కాక్చింగ్, విష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ఐదు రోజుల వరకూ అన్ని రకాల ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మణిపూర్ వ్యాప్తంగా ఆదివారం కూడా మైతీ ప్రజల నిరసనలతో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.
పది రోజుల బంద్కు పిలుపు..
మణిపూర్లోని వ్యాలీ డిస్ట్రిక్ట్స్ లో ఆదివారం నుంచి పది రోజుల పాటు సంపూర్ణ బంద్ పాటించాలని అరంబాయి టెంగోల్ సంస్థ పిలుపునిచ్చింది. మొదట్లో సాంస్కృతిక పునరుజ్జీవ సంఘంగా ఏర్పడిన ఈ సంస్థ తర్వాత మిలీషియా తరహా గ్రూపులతో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల గవర్నర్ తో చర్చలు జరిపిన ఈ సంస్థ ప్రతినిధులు కొన్ని ఆయుధాలను సరెండర్ చేశారు. కాగా, మణిపూర్ లో కుకీ, మైతీ జాతుల మధ్య 2023 మే నెలలో ఘర్షణలు మొదలయ్యాయి. ఈ అల్లర్లలో 260 మంది చనిపోగా, వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది.
అరెస్టును ప్రకటించిన సీబీఐ..
ఇంఫాల్ ఎయిర్ పోర్టు వద్ద అరంబాయి టెంగోల్ సంస్థ లీడర్ కనన్ సింగ్ను ఆదివారం అరెస్ట్ చేశామని సీబీఐ వెల్లడించింది. మణిపూర్లో 2023లో జరిగిన హింసాత్మక ఘటనల్లో అతడి పాత్ర ఉందన్న ఆరోపణలతో అరెస్ట్ చేశామని తెలిపింది. అతడిని కోర్టులో హాజరుపర్చి, రిమాండ్కు తీసుకునేందుకు గువాహటికి తరలించినట్టు పేర్కొంది. మణిపూర్ అల్లర్లపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మణిపూర్ హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసుల విచారణ అస్సాంలోని గువాహటి నుంచి కొనసాగిస్తున్నారు. కాగా, మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా తాజా పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సాధారణ పరిస్థితి నెలకొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్ తెలిపారు.