షకీల్ రైస్ మిల్లుల్లో అక్రమాలు.. ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తింపు

షకీల్ రైస్ మిల్లుల్లో అక్రమాలు.. ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తింపు

బీఆర్ఎస్ సీనియర్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబ సభ్యులపై రైస్ మిల్లులపై టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ లో అమ్ముకున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. షకీల్ మిల్లుల్లో సుమారు రూ.70 కోట్ల ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు నిర్ధారించారు. యాసంగి, వానా కాలం సీజన్ కు కేటాయించిన కోటా ధాన్యం మాయం అయినట్లు తేల్చారు. 

3, 38లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పగించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. సాలూరు మండలంలోని నాలుగు రైస్ మిల్లుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ధనిక, రహెల్, రసూ, అమీర్ అనే రైస్ మిల్లుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే PDS రైస్ ని సీజ్ చేసి.. డీటీకి అప్పగించారు టాస్క్ ఫోర్స్ అధికారులు. కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. 

బీఆర్ఎస్ పరిపాలనలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ఎమ్మెల్యే షకీల్ తమ రైస్ మిల్స్ లో అక్రమాలు జరిపారని అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల పాటు తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉన్నతాధికారుల సూచన మేరకు తదుపరి చర్యలు ఉంటాయని పౌర సరఫరా అధికారులు చెబుతున్నారు.