నిర్మల్ జిల్లాలో దళితబంధు అడిగితే కేసులు

 నిర్మల్ జిల్లాలో దళితబంధు అడిగితే కేసులు

నిర్మల్ జిల్లా : నిర్మల్ జిల్లా నర్సాపూర్ జిలో ఐదుగురు దళితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అలేఖ్య అనే టీఆర్ఎస్ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఐదుగురు దళితులపై కేసులు నమోదు చేశారని తెలుస్తోంది. దళితబంధు లబ్ధిదారుల ఎంపిక విషయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నర్సాపూర్ జి గ్రామస్తులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళితబంధు అడిగితే కేసులు నమోదు చేశారని బాధితులు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూ జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. 

అసలేం జరిగింది..?
గత నెల 26వ తేదీన  బతుకమ్మ చీరల పంపిణీ కోసం నిర్మల్ జిల్లా నర్సాపూర్ -జి గ్రామానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లారు. ఆ కార్యక్రమంలో ఓ దళిత మహిళ మంత్రికి ఫిర్యాదు చేశారు. దళితబంధు తమకు రావడం లేదని, ఎంపిక విషయంలోనూ పారదర్శకత లేదని చెప్పింది. దీంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సదరు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాకు ఇష్టం వచ్చిన వాళ్లకు దళిత బంధు ఇస్తాం. వచ్చే వరకు ఓపిక లేకుంటే ఏం చేయలేం’ అంటూ కామెంట్స్ చేశారు. 

‘ఇచ్చింది ఎక్కువైతే ఇలాగే ఉంటది.. ఒక్కసారిగా 10 లక్షలు ఇస్తే ఏం చేస్తావో చూపెట్టు’ అని మహిళను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిలదీశారు. దళిత బంధు అర్హులకు రాలేదని అడిగిన మహిళను బయటకు వెళ్లిపొమ్మని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దళిత బంధుతో కార్లు, ట్రాక్టర్లు కొంటే అవి అన్నం పెడుతాయా..? రూ.10 లక్షలతో ఏం చేసి బతుకుతారు..? మీకు ఏం అనుభవం ఉంది. చెబితేనే దళిత బంధు ఇస్తాం. దళిత బంధు మీకు మేమియ్యం. కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ల నుండే తీసుకోండి. బీజేపీ వాళ్లతో తిరుగుతున్నారు కదా. వాళ్ల దగ్గరి నుండి దళిత బంధు తెచ్చుకోండి’ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీరియస్ అయ్యారు.


 
అంతకుముందు.. అర్హులకు దళిత బంధు ఇవ్వాలని కోరుతూ.. మంత్రి క్యాంప్ ఆఫీస్ తో పాటు కలెక్టరేట్ ను నర్సాపూర్ -జి గ్రామస్తులు ముట్టడించారు. ఈ క్రమంలోనే బతుకమ్మ చీరల పంపిణీ చేసేందుకు నర్సాపూర్ జి గ్రామానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లిన సందర్భంలో సీరియస్ అయ్యారు. గత నెల 30వ తేదీన అంబేద్కర్ విగ్రహం ముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలపై దళితులు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.