
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ఎంతో కీలకం, బాధ్యతాయుతమైనది. బ్రిటిష్ పాలనలో అణచివేతకు గురైన మన భారతీయులు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో జీవించేవారు. దాదాపు 200 సంవత్సరాలపాటు భారతీయులు విదేశీయుల పాలనాధీనంలో జీవించాల్సి వచ్చింది. ఆ సమయంలో భారతీయులకు పాలనా వ్యవస్థలో భాగంగా శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలలో స్థానం దక్కే అవకాశం లేకపోయింది.
బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఎందరో భారతీయులు తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలంగా 1947లో స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాం. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం భారతీయులకు దేశ పాలనలో పాల్గొనడానికి అనేక అవకాశాలు లభించాయి. ప్రజలు ఎన్నికల ద్వారా రాజకీయ నాయకుల్ని ఎన్నుకునే హక్కు పొందారు. పోటీ పరీక్షల ద్వారా అధికారుల నియామకం ప్రారంభమైంది. అర్హులైనవారికి ముఖ్యమైన పదవులు లభించాయి.
అవి కేవలం గౌరవప్రదమైన పదవులే కాదు, ప్రజల పన్నులపై ఆధారపడి, ప్రజల శ్రేయస్సును కోరుకునే సేవాభావంతో చేసే పదవులు. స్వాతంత్ర్య సమరయోధులు స్వతంత్ర భారతదేశంలో పదవుల్లో వయసు రీత్యా, అనారోగ్యం కారణంగా ఎక్కువ కాలం జీవించలేదు. కానీ, వారు పదవుల విలువను, బాధ్యతను బాగా గుర్తించారు. ప్రజలకు న్యాయం చేయడం, పారదర్శక పాలన అందించడం, ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడం, వీటిని తమ ధర్మంగా భావించి పని చేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్రను పోషించిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం సాధించిన తరువాత దాదాపు 54 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ, వారసత్వ రాజకీయాలు, అవినీతి ఆరోపణలు, పాలనా అలసత్వం, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం వంటి కారణాలతో అనుకున్నంతగా అభివృద్ధి జరగలేదు. బలమైన ఒక ప్రతిపక్షం లేకపోవడం వలన కూడా జరగవలసిన నష్టం జరిగిపోయింది.
అధికారం శాశ్వతం కాదు
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షానికి విపరీతమైన స్వేచ్ఛ లభిస్తుంది. దీంతో దేశ ప్రయోజనాలు దెబ్బతినడమే కాకుండా, కొన్ని ప్రాంతీయ అసమానతలకు కూడా దారి తీసి కొన్ని రాష్ట్రాల్లో కొత్త ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. వాస్తవానికి, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప, దేశవ్యాప్తంగా సమగ్ర అభివృద్ధి కోసం ఒక ప్రయత్నం కూడా జరగలేదు.
మన దేశంలో ఆ సమతుల్యతను సాధించడంలో మనం విఫలమైనాం. 1977లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా, అంతర్గత విభేదాలతో మూడు సంవత్సరాల్లో అధికారం కోల్పోయింది. 1980లో స్థాపితమైన భారతీయ జనతా పార్టీ కొద్దికాలంలోనే బలమైన జాతీయ ప్రత్యామ్నాయంగా ఎదిగింది. 1996లో మొదటిసారిగా కేంద్రంలో అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత దేశ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగింది.
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ఎంతో బాధ్యతాయుతమైనది అనే విషయాన్ని మనం గమనించాలి. బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వాన్ని ప్రశ్నించగలదు, తప్పులను ఎత్తిచూపగలదు, ప్రజల హక్కులను రక్షించగలదు. ప్రజాస్వామ్యంలో పాలకులపై ప్రజల అభిమానం తాత్కాలికమే.
అధికారం ఉన్నప్పుడు పొగడ్తలు, అది పోయినప్పుడు విమర్శలు తప్పవు. పదవి ఒక అసిధార వ్రతం, అనగా పదునైన ఖడ్గం అంచున ప్రయాణం, కఠినమైన, జాగ్రత్తగా పాటించవలసిన వ్రతం. చేసే ప్రతి పనిలో ఒక్క తప్పిదం జరిగినా పెద్ద నష్టానికి దారి తీస్తుంది. పాలకులు ఎన్నడూ తమ పదవులను తలకెక్కించుకోకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తీసుకొని పాలన సాగించాలి. అధికారం తాత్కాలికమైతే, సేవ శాశ్వతంగా మిగలాలి.
ప్రజల తరఫున మాట్లాడే శక్తి ప్రతిపక్షం
ప్రతిపక్షాలు కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదు, నిశితంగా గమనించి, ప్రజల తరఫున మాట్లాడే శక్తిగా నిలవాలి. తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి దేశ ప్రయోజనాలకోసం పోరాడాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉంటుంది. స్వాతంత్ర్య పోరాటం ఫలితంగా మనకు లభించిన హక్కులు, పదవులు మనకు గర్వంగా అనిపిస్తాయి.
కానీ, వాటి వెనుక ఉన్న బాధ్యతలను మర్చిపోవద్దు. ప్రజలసేవనే ధర్మంగా భావించి పనిచేస్తేనే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోగలుగుతాం. నిజమైన ప్రజాస్వామ్యంలో ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వాలు నడుచుకోవాలి. ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేవిధంగా, అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా
పారదర్శకతతో పాలన సాగాలి.
మనుషుల ఆలోచనలు వేర్వేరు. కొందరు తమ ప్రతిభ, కృషితో జీవితం మెరుగుపర్చుకుంటారు. మరికొందరు సాదా జీవితం కోరుకుంటారు. వారి ఇద్దరి ఆవశ్యకతలను, స్వతంత్రతను గౌరవిస్తూ, ప్రభుత్వాలు సమాజానికి సేవలందిస్తూ ప్రజలను స్వావలంబన వైపు నడిపించాలి. కానీ, కొన్నిసార్లు ప్రభుత్వాలు తమ బాధ్యతలను పక్కనపెట్టి, ఆర్థిక అసమానతలు తొలగించాలనే ముసుగులో, ఓట్ల కోసమే ఉచితాల ప్రలోభాలు చూపుతున్నాయి.
ఇలా ప్రజలను ఉచితాల కోసం ఎదురుచూసే స్థితికి నెట్టి వేయడంవల్ల వారు తమలో ఉన్న ప్రతిభను వెలికి తీయకుండా కాలం గడిపేస్తున్నారు. ఇలాంటి విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా, సమాజాన్ని దారితప్పించే ప్రమాదం కలదు. ప్రభుత్వాలు ప్రజలలో శక్తి సామర్థ్యాలను ప్రోత్సహించేవిధంగా కార్యాచరణ చేపట్టాలి.
- సోమ
శ్రీనివాస్ రెడ్డి,
సెక్రటరీ, ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్