ఇండియాకు టెస్లా!
ఈవారంలోనే పీఎంఓతో మీటింగ్
కాంపోనెంట్స్ పై చర్చించే చాన్స్
న్యూఢిల్లీ : మన దేశంలో తయారీ చేపట్టే ఉద్దేశంతో మరోసారి కేంద్ర ప్రభుత్వ అధికారులను కలవడానికి టెస్లా ఇంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు ఈ వారం ఇక్కడకు వస్తున్నారు. చైనాకు బయట వేరొక తయారీ ఫెసిలిటీ ఏర్పాటు చేసుకోవాలని టెస్లా ఇంక్ సీరియస్గా ఆలోచిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఆఫీసులోని అధికారులతో సహా మరి కొంత మంది అధికారులతో టెస్లా ఎగ్జిక్యూటివ్స్ ఈ పర్యటనలో సమావేశం కానున్నారు. టెస్లా మోడల్స్కు కొన్ని కాంపోనెంట్స్ను లోకల్గా సేకరించడం వంటి అంశాలపై ప్రధానంగా డిస్కషన్స్ జరగనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. చాలా ఏళ్లుగా నలుగుతున్నప్పటికీ ఇప్పటిదాకా టెస్లా ఇంక్ ఇండియాలోకి అడుగుపెట్టలేదు. ఇండియా విధిస్తున్న అధిక ఇంపోర్ట్ డ్యూటీలపై టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ విమర్శలు గుప్పించారు. అంతేకాదు, మన దేశపు ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీపైనా వ్యతిరేకంగా మాట్లాడారు. చైనాలో తయారు చేసిన కార్లను మా దేశంలో అమ్మొద్దని మరోవైపు ఇండియా టెస్లాకు హితవు చెప్పింది.
టెస్లా కంపెనీ సప్లయ్ చెయిన్, ప్రొడక్షన్, బిజినెస్ డెవలప్మెంట్ టీములలోని ముఖ్యులందరూ ఇండియాకు వచ్చే ప్రతినిధి బృందంలో ఉండబోతున్నారు. ఇంపోర్ట్ డ్యూటీలను తగ్గించాలనే తమ డిమాండ్ను వారు ప్రభుత్వానికి మరోసారి వినిపించబోతున్నట్లు సమాచారం. ఇండియా నుంచి కాంపోనెంట్స్సమకూర్చుకోవడం నిజానికి టెస్లాకు మేలు చేస్తుంది. గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్గా దేశాన్ని తీర్చి దిద్దాలనుకుంటున్న మోడీ డ్రీమ్కు కూడా ఇది అనుకూలమైనదే అవుతుంది. సరిహద్దు సమస్యలుండటంతో చైనాలోని షాంఘై ఫ్యాక్టరీలో తయారయ్యే టెస్లా కార్లను దేశంలో అమ్మవద్దని ఇండియా కోరుతోంది.
ఇతర కంపెనీలు మాత్రం...
మరోవైపు టెస్లాకు గ్లోబల్ ప్రత్యర్ధులైన మెర్సిడెస్–బెంజ్ ఏజీ వంటి కంపెనీలు ఇండియాలోనే లోకల్గా కార్లను అసెంబుల్ చేసి, అమ్మడానికి ముందుకు వస్తున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్కు పెరుగుతున్న డిమాండ్ను అనుకూలంగా మలుచుకోవాలని ఆ కంపెనీలు భావిస్తున్నాయి. మన దేశంలో ఆటోమొబైల్ మార్కెట్కు గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువని అవి అంచనా వేస్తున్నాయి.
ఏదేమైనప్పటికీ, తన ఖరీదయిన మోడల్స్ను ఇండియాలో తయారు చేసే ఆలోచనలో టెస్లా లేదు. మొదటగా కార్లు అమ్మి, సర్వీసింగ్ చేయడానికి అనుమతి ఇస్తే తప్ప మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీని ఏ దేశంలోనూ పెట్టబోమని మస్క్ గతంలోనే స్పష్టం చేశారు. కానీ, చైనాకు ఆల్టర్నేటివ్ వెతుక్కోవల్సిన అగత్యం ఏర్పడటంతో మిగిలిన అమెరికన్ కంపెనీలలాగే ఇప్పుడు టెస్లా కూడా ఇతర దేశాల వైపు చూడాల్సి వస్తోంది. వాషింగ్టన్–బీజింగ్ల మధ్య కూడా ఒక రకమైన ఘర్షణ వాతావరణమే కొనసాగుతోంది. యాపిల్ ఇంక్ను టెస్లా ఇంక్ ఆదర్శంగా తీసుకునే ఛాన్స్ అయితే కనబడుతోంది. ఇండియాను ఆల్టర్నేటివ్ మాన్యుఫాక్చరింగ్ బేస్గా మలుచుకున్న యాపిల్ ఇప్పుడు ఇక్కడే 7 శాతం స్మార్ట్ఫోన్లను తయారు చేస్తోంది.