- ముగ్గురు నిందితులను విచారించిన సిట్
- రోహిత్ రెడ్డికి నందకుమార్ ఎన్నాళ్లుగా తెలుసు?
- పొలిటికల్ లింక్స్ గురించి స్టేట్మెంట్ రికార్డ్
- ఇయ్యాల కూడా ప్రశ్నించనున్న పోలీసు అధికారులు
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొను గోలు కేసులో ముగ్గురు నిందితులను సిట్ గురువారం కస్టడీకి తీసుకుంది. చంచల్గూడ జైలులో ఉన్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలను రాజేంద్రనగర్ ఏసీపీ ఆఫీస్కి తరలించింది. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ ఆధ్వర్యంలోని సిట్ సుమారు 6గంటలు విచారించింది. సాయంత్రం 5 గంటల తర్వాత తిరిగి జైలుకు తరలించింది. మొదటి రోజు విచారణలో వ్యక్తిగత వివరాలు, పొలిటికల్ లింక్స్ గురించి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు తెలిసింది. రెండో రోజు శుక్రవారం ఉదయం కూడా విచారించనున్నారు. సిట్ అధికారులు గురువారం ముగ్గురు నిందితులను విడివిడిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన నందకుమార్తో ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజిలకు పరిచయం ఎలా ఏర్పడిందని ప్రశ్నించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని రాజకీయ నాయకులు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ లీడర్లతో ఉన్న కాంటాక్ట్స్ సంబంధించిన వివరాలు రికార్డ్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి నందకుమార్ ఎంతకాలంగా పరిచయం ఉన్నారు? పార్టీ మార్పు, రూ.100 కోట్ల ఆఫర్ గురించిన ప్రస్తావన ఎలాంటి సందర్భంలో వచ్చింది? ముందుగా రోహిత్రెడ్డి ప్రపోజ్ చేశాడా? లేక డీల్ సెట్ చేస్తానని నందకుమార్ చెప్పాడా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
కాల్ డేటా ఆధారంగా ప్రశ్నలు
రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో సేకరించిన ఆడియో, వీడియో, ముగ్గురు నిందితుల కాల్ డేటా ఆధారంగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ‘ఆఫర్’ గురించి జరిగిన చాటింగ్స్ వివరాలు సేకరించినట్లు తెలిసింది. రామచంద్ర భారతి హైదరాబాద్కు రావడానికి గల కారణాలపై ఆరా తీసినట్లు సమాచారం. అనుమానిత ఫోన్ నంబర్స్ గురించి ప్రశ్నించినట్లు తెలిసింది. రామచంద్రభారతి మాటల్లో ప్రస్తావనకు వచ్చిన సంతోష్, తుషార్లకు ఆఫర్తో ఎలాంటి సంబంధాలు ఉన్నాయని అడిగినట్లు తెలిసింది. దీనికి కొనసాగింపుగా శుక్రవారం విచారణలో కీలక వివరాలను సిట్ అధికారులు రాబట్టనున్నారు.