రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు

రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు

హైదరాబాద్: ఇంజినీరింగ్ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎఫ్ఆర్సీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని 159 కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జీవో జారీ చేసింది. విద్యా శాఖ తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలోని మొత్తం 40 కాలేజీల్లో ఇంజినీరింగ్  ఫీజు రూ.లక్ష దాటింది. ఇక ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీసం రుసుము రూ.40 వేలకు పెంచారు. కొన్ని ప్రభుత్వ కాలేజీల్లో ఆ ఫీజు రూ. లక్ష దాటింది. ఎంజీఐటీ లో రూ.1.60 లక్షలు, సీవీఆర్ లో రూ.1.50 లక్షలు, సీబీఐటీ, వాసవి కాలేజీల్లో రూ.1.40 లక్షలుగా ఫీజు ఖరారు చేశారు. ఈ ఫీజులు వచ్చే మూడేళ్లపాటు అమలులో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

అలాగే ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఫీజులను కూడా విద్యా శాఖ ఖరారు చేసింది. ఎంబీఏ, ఎంసీఏ కనీస వార్షిక ఫీజును రూ.27 వేలు, ఎంటెక్ కనీస వార్షిక ఫీజును రూ.57 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఎంసెట్ (ఇంజనీరింగ్ )కు సంబంధించిన చివరి కౌన్సిలింగ్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇటీవలే రిలీజ్ చేసింది. ఈ నెల 21 నుంచే ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సిలింగ్ జరగనుంది. త్వరితగతిన అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసి క్లాసులు నిర్వహించేందుకు విద్యా శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.