- కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోనూ ఇదే పరిస్థితి
- పాత ప్లేసుల్లోనే విధుల నిర్వహణ
- పేరుకే సర్కిల్స్, స్టేషన్ల బైఫర్కేషన్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం కొన్ని డిపార్ట్మెంట్లలో అధికారులకు ప్రమోషన్లు కల్పించి.. పోస్టింగ్లు ఇచ్చుడు మరిచిపోయింది. పేపర్లపై పదోన్నతులు చూపించి చేతులు దులుపుకొంటోంది. ఏడాది దాటినా పోస్టింగ్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ నుంచి సీఐగా ప్రమోషన్లు పొందినోళ్లంతా ఎక్కడున్నోళ్లు అక్కడే పనిచేస్తున్నారు. అటు వాణిజ్య పన్నుల శాఖలోనూ ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్రంలోని ఆబ్కారీ శాఖలో పనిచేస్తున్న 40 మంది ఎస్ఐలకు సీఐలుగా ప్రమోషన్ ఇచ్చారు. కానీ ఏడాది అవుతున్నా వారికి ఇప్పటి దాకా పోస్టింగ్స్ ఇవ్వలేదు. అంతకు ముందు సీఐ పైస్థాయి అధికారులకు ప్రమోషన్లు ఇచ్చారు. సీఐగా ప్రమోషన్ పొందినవారికి మాత్రం పత్తా లేదు. ప్రస్తుతం వారంతా పాత జాగాల్లోనే డ్యూటీలు చేస్తున్నారు.
పేరుకే ఎక్సైజ్ స్టేషన్ల బైఫరికేషన్..
2020, జులైలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ స్టేషన్లను బైఫరికేషన్ చేసింది. స్టేషన్లు పెరిగితే ప్రమోషన్లు వచ్చినోళ్లకు పోస్టింగ్స్ సులభమవుతుందని సర్కార్ భావించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 139 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటిపై పని భారం ఎక్కువగా ఉంది. విస్తీర్ణం కూడా ఎక్కువగా ఉండటంతో వీటిని విభజించి 14 అదనపు స్టేషన్లను ఏర్పాటు చేశారు. కానీ కొత్త స్టేషన్లు మాత్రం ఇప్పటి దాకా ఏర్పాటు చేయలేదు.
ఐదేండ్లుగా ఒకేచోట..
ఆబ్కారీ శాఖలో పనిచేస్తున్న సీఐలు ఏండ్ల తరబడి ఒకే చోట వర్క్ చేస్తున్నారు. 250 మంది సీఐలు ఐదేండ్లుగా ఒకే స్థానంలో కొనసాగుతున్నారు. గతంలో ఎక్సైజ్ స్టేషన్ హౌస్ పరిధిలో రెండేండ్లకోసారి డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్స్ ఉండేవి. కానీ ఐదేండ్లుగా దీన్ని అమలు చేయడం లేదు. ఏండ్ల తరబడి ఒకే చోట పనిచేయడంతో అక్రమాలకు తావిచ్చినట్లు అవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోనూ ఇంతే..
కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొంత మందికి పదోన్నతులు ఇచ్చినా పోస్టింగ్స్ ఇవ్వలేదు. కొంతమందికి అసలు ప్రమోషన్లే కల్పించలేదు. ఏడాది నుంచి పోస్టింగ్స్ కోసం అధికారులు వెయిట్ చేస్తున్నారు. ఈ శాఖలోనూ.. 2020లో సర్కిల్స్ బైఫరికేషన్ చేశారు. 100 సర్కిళ్లకు అదనంగా మరో 18 సర్కిళ్లను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటికీ ఎక్కడివి అక్కడే ఉన్నాయి.