స్కూల్స్ రీ ఓపెన్ పై క్లారిటీ ఇవ్వని సర్కార్

స్కూల్స్ రీ ఓపెన్ పై క్లారిటీ ఇవ్వని సర్కార్
  • రేపటితో ముగియనున్న హాలిడేస్
  • స్కూళ్లు తెరవాలంటున్న ప్రైవేట్​ మేనేజ్​మెంట్లు 
  • కరోనా తగ్గకపోవడంతో పేరెంట్స్‌‌‌‌‌‌‌‌లో ఆందోళన
  • నేడు హెల్త్, ఎడ్యుకేషన్ ఆఫీసర్లతో సమావేశం! 
  • మరో వారం సెలవులు పొడిగించే అవకాశం?

హైదరాబాద్, వెలుగు: స్కూళ్లు, కాలేజీల రీఓపెన్‌‌‌‌‌‌‌‌పై రాష్ట్ర సర్కారు ఎటూ తేల్చుకోలేకపోతోంది. కరోనా వల్ల పొడిగించిన సంక్రాంతి సెలవులు ఆదివారంతో ముగియనుండగా.. సోమవారం నుంచి బడులు చాల్ అయితయా, లేదా అనేది ఇంకా ప్రకటించలేదు. శనివారం ఆఫీసర్లతో ప్రభుత్వ పెద్దలు రివ్యూ చేస్తారని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటారని విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా కేసులు తగ్గకపోవడంతో పేరెంట్స్‌‌‌‌‌‌‌‌ ఆందోళన చెందుతుండగా.. స్కూళ్లు ఓపెన్ చేయాలని ప్రైవేటు మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లు, కొన్ని టీచర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాల్లో పాజిటివిటీ రేటు తగ్గుతోందని, బడుల ప్రారంభానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని హెల్త్ ఆఫీసర్లు అంటున్నారు. కానీ విద్యా శాఖ ఆఫీసర్లు మాత్రం.. బడులు, కాలేజీలు తెరిస్తే హాస్టళ్లు, గురుకులాలు తెరవాల్సి ఉంటుందని, స్టూడెంట్లకు ఏమైనా జరిగితే బాధ్యత తమపై పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో విద్యాసంస్థలను తెరిచే అంశంపై సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొన్నది.

థర్డ్ వేవ్ రావడంతో..

రాష్ట్రంలో ఈ నెల తొలి వారం నుంచి కరోనా కేసులు పెరగడం మొదలైంది. దీంతో 11వ తేదీ నుంచి విద్యాసంస్థలకు ఇవ్వాల్సిన సంక్రాంతి సెలవులను సర్కారు ఈ నెల 8 నుంచే ఇచ్చింది. ఈ నెల 17న బడులను తెరవాల్సి ఉన్నా.. కేసులు తగ్గకపోవడంతో 30 దాకా హాలిడేస్​ని పొడిగించింది. ఈ క్రమంలోనే 8, 9, 10 తరగతుల పిల్లలకు ఈనెల 24 నుంచి ఆన్​లైన్, టీవీ పాఠాలకు సర్కారు పర్మిషన్ ఇచ్చింది. ఈ క్లాసులకు అధికారిక లెక్కల ప్రకారం 65 శాతానికి పైగా సర్కారు స్కూళ్ల స్టూడెంట్లు అటెండ్ అవుతున్నారు. ఆన్‌‌‌‌లైన్ క్లాసులకు 28 వరకే పర్మిషన్ ఇచ్చారు. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 31న స్కూళ్లు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో ఇంకా థర్డ్ వేవ్ తగ్గకపోవడంతో విద్యాసంస్థలు తెరుస్తారో లేదో అనే అయోమయం స్టూడెంట్లు, టీచర్లలో నెలకొన్నది.

హెల్త్ ఆఫీసర్లు అట్ల.. ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఇట్ల..

ఈనెల 30 దాకా విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయని సర్కారు మొదట్లో ప్రకటించింది. ఆన్‌‌‌‌లైన్ క్లాసుల గురించి చెప్పలేదు. ఆ తర్వాత ఆన్‌‌‌‌లైన్, టీవీ పాఠాలు మొదలుపెట్టారు. బడులు తెరవాలని ఇప్పటికే ప్రైవేటు మేనేజ్‌‌‌‌మెంట్లు, కొన్ని టీచర్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. పక్క రాష్ట్రం ఏపీలో రోజూ 13 వేల కేసులు వస్తున్నా.. బడులను మూసివేయలేదని గుర్తుచేస్తున్నాయి. మరోవైపు వారం రోజులుగా అన్ని జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతున్నదని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో బడుల ప్రారంభానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొంటున్నారు. కానీ విద్యా శాఖ అధికారులు దీనికి భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బడులు, కాలేజీలు తెరిస్తే హాస్టళ్లు, గురుకులాలు తెరవాల్సి ఉంటుందని, స్టూడెంట్లకు కరోనా సోకితే బాధ్యత తమపైనే పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఓ వారం ఆగితే బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.