మందమర్రి/నస్పూర్/ బెల్లంపల్లి, వెలుగు: సింగరేణి కాంట్రాక్టర్ల -డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. జేఏసీ పిలుపులో భాగంగా శుక్రవారం బెల్లంపల్లి రీజియన్లో మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో 24 డిపార్ట్మెంట్లకు చెందిన 8వేల మంది కార్మికులు విధులు బహిష్కరించి వేర్వేరుగా ధర్నాలు, ర్యాలీలు తీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘం జేఏసీ లీడర్లు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో 90 శాతం వేతనాలు పెంచాలని, పర్మినెంటు కార్మికులతో సమానంగా లాభాల్లో వాటా, గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని, తదితర చట్టబద్ద హక్కులు సాధించేవరకు సమ్మె విరమించేది లేదన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో షిర్కే నుంచి తెలంగాణ తల్లి విగ్రహం, ప్రెస్క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు. రామకృష్ణాపూర్లోని సింగరేణి సివిల్ ఆఫీస్ నుంచి వారాంతపు సంతలోని అంబేద్కర్విగ్రహం వరకు, మందమర్రిలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీలు నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. జేఏసీ లీడర్లు టి.శ్రీనివాస్, రామగిరి రామస్వామి, సంకె రవి, డి.బ్రహ్మనందం, దూలం శ్రీనివాస్, ఎండీ.జఫర్ పాల్గొన్నారు.
బెల్లంపల్లిలో..
కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల సాధన కోసం కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా శుక్రవారం బెల్లంపల్లిలో సింగరేణి సివిక్ ఆఫీస్ ముందు సింగరేణి యాజమాన్యం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు ఎండీ.చాంద్ పాషా, టి. మనిరామ్ సింగ్, ఎ. మహేందర్ లు మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు నారాయణ, కృష్ణవేణి పా ల్గొన్నారు.