రెరా సంగతి చూడండి  కేంద్రానికి సుప్రీం ఆదేశం

రెరా సంగతి చూడండి  కేంద్రానికి సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: రియల్​ ఎస్టేట్​ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్​ 2016 (రెరా) అమలు కోసం రాష్ట్రాలు తెచ్చిన రూల్స్​ వల్ల కొనుగోలుదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం రూపొందించిన చట్టం పూర్తిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల రాష్ట్రాల రూల్స్​ను కేంద్రం పరిశీలిస్తుందని, చట్టం మరింత మెరుగ్గా అమలవుతుందని ఫోరమ్​ ఫర్​ పీపుల్స్​ కలెక్టివ్​ ఎఫర్ట్స్​ (ఎఫ్​పీసీఈ) పేర్కొంది. మీరు చేసిన చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాల రూల్స్​ ఉన్నాయా లేదా ? అనేది తేల్చాలని జడ్జీలు డీవై చంద్రచూడ్​, సూర్యకాంత్​తో కూడిన బెంచ్​ కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు మూడు నెలల గడువు ఇస్తూ, ఈ ఏడాది మేలోపు రిపోర్టు సమర్పించాలని స్పష్టం చేసింది. రెరా చట్టం ఐదేళ్ల నుంచి అమలవుతున్నా ఆశించిన ప్రయోజనాలను కలిగించడం లేదని ఎఫ్​పీసీఈ ప్రెసిడెంట్​ అభయ్​ కుమార్​ ఉపాధ్యాయ్ అన్నారు. రెరాను అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా అమలు చేయడం లేదని, సేల్​ అగ్రిమెంట్​కు సంబంధించిన రకరకాల రూల్స్​ ఉన్నాయని అన్నారు. కొంతమంది బిల్డర్లు రెరాను ఖాతరు చేయకపోవడంతో హోమ్​ బయర్లకు మేలు జరగడం లేదని చెప్పారు. సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల కొనుగోలుదారులకు తప్పకుండా మేలు జరుగుతుందని భావిస్తున్నట్టు అభయ్​ వివరించారు. రెరా అమలులో వైఫల్యాలు, లోపాల గురించి త్వరలోనే సుప్రీంకోర్టుకు తెలుస్తుందని, బయర్లకు న్యాయం జరుగుతుందని తెలియజేశారు. ఇక నుంచి బిల్డర్లకు, బయర్లకు మధ్య జరిగే ఒప్పందం సక్రమంగా అమలయ్యే అవకాశాలు ఉంటాయని, పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పేమెంట్​ షెడ్యూల్, డెలివరీ షెడ్యూల్, నిర్మాణ లోపాల బాధ్యత వంటి విషయాల్లో రూల్స్​ సక్రమంగా అమలు కావడం లేదని కొలియర్స్​ ఇండియా సీఈఓ రమేశ్​ నాయర్​ అన్నారు.