
న్యూఢిల్లీ, వెలుగు: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. సాయిబాబాను, ఇతరులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది. జైలు నుంచి వారు విడుదల కావడంపై స్టే విధించింది. ఈ మేరకు శనివారం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన ఆరోగ్య పరిస్థితులు, వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకుని రిలీజ్ చేయాలని, తనను గృహ నిర్భందంలో ఉంచాలని సాయిబాబా సుప్రీంకోర్టు అభ్యర్థించారు. ఈ కేసులో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
హౌస్ అరెస్ట్ కోసం సాయిబాబా విజ్ఞప్తి
ప్రొఫెసర్ సాయిబాబాతోపాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు శుక్రవారం నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, బెలా ఎం త్రివేదీతో కూడిన బెంచ్ శనివారం సెలవు రోజైనా విచారణ జరిపింది. సాయిబాబా తరఫున సీనియర్ అడ్వొకేట్ ఆర్ బసంత్ వాదనలు వినిపించారు. తన క్లయింట్ 90%కి పైగా పారాప్లెజిక్తో బాధపడుతున్నాడని, పూర్తిగా వీల్చైర్కే పరిమితమయ్యాడని కోర్టుకు తెలిపారు. ఆయన లంగ్స్కు ఎముకలు తాకుతున్నాయని, ఇది ఆయన ఆరోగ్యాన్ని మరింత దిగజారుస్తోందని చెప్పారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఆయన విడుదలకు అనుమతించాలని, హౌస్ అరెస్ట్లో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. అయితే, సుప్రీంకోర్టు బెంచ్ ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చింది.