
భాష లేకపోతే జ్ఞానం ఒక తరం నుంచి మరొక తరానికి ఎలా బదిలీ అవుతుంది? పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు బోధన, పుస్తకాల రచన, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, చరిత్ర.. ఇవన్నీ భాష ద్వారానే సాధ్యమవుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన భాషా శాస్త్రాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య మండలి విస్మరించే ప్రయత్నం చేస్తోంది. ఇది మానవ మూలాలను పెకిలించే వ్యవస్థగా మొదలైనట్టు అనిపిస్తుంది.. మాతృభూమి నుంచి మానవ సంబంధాలను దూరం చేస్తున్నట్టు భాషా శాస్త్రాలను విద్యార్థులకు దూరం చేస్తున్న ప్రయత్నం జరుగుతోంది. డిగ్రీ విద్యా వ్యవస్థలో భాషా బోధనలపై తీసుకుంటున్న నిర్ణయాలుపలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఉన్నత విద్యామండలి డిగ్రీ విద్యావ్యవస్థలో క్రెడిట్స్ క్రీడ మొదలుపెట్టింది. యూజీసీ ఆదేశాలంటూ లాంగ్వేజ్ల మనుగడని ప్రశ్నార్థకం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో రెగ్యులర్, కాంట్రాక్ట్, అతిథి అధ్యాపకుల జీతాలు యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం జీతాలు అందడం లేదు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి, యూజీసీ రాష్ట్రంలోని కళాశాలల్లో యూనివర్సిటీలలో ఖాళీలు లేకుండా అధ్యాపకులను నియమించాలని సూచించింది. ఇవి అమలు చేస్తున్నారా? ప్రస్తుతం డిగ్రీ వ్యవస్థలో భాషా శాస్త్రాల బోధనకు 20 క్రెడిట్లతో భాషా బోధనలు జరుగుతున్నాయి. అవి ఫస్ట్ ఇయర్ లో 4+4 క్రెడిట్స్, సెకండ్ ఇయర్ లో 3+3 క్రెడిట్స్, థర్డ్ ఇయర్లో 3+3 క్రెడిట్స్గా మొత్తం 20 క్రెడిట్లలో భాషా బోధన జరుగుతున్నాయి. అలాంటిది భాషా బోధనల క్రెడిట్లను కుదించే ప్రయత్నం జరుగుతోంది. ఇదే జరిగితే తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, సంస్కృతం భాషా బోధనలు చేసే అధ్యాపకుల జీవితాలు ఛిద్రమైపోతాయి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు ఇలా ప్రతి కళాశాలలో సగానికి సగం భాషా పండితులు రోడ్డున పడతారు. అంతేకాకుండా డిగ్రీ తర్వాత పీజీ చేయాలనే విద్యార్థుల ఆకాంక్షకు క్రెడిట్స్ కోత అడ్డుకట్ట వెయ్యనుంది. దీంతో యావత్తు భాషా ప్రేమికులు ముక్తకంఠంతో క్రెడిట్స్ కోతను వ్యతిరేకిస్తున్నారు.
క్రెడిట్ల కోత పెడితే..
డిగ్రీలో భాషా బోధనకు 20 క్రెడిట్ లేకుంటే విద్యార్థి భావోద్వేగం, మానవీయ విలువలు, విజ్ఞాన వికాసం కుంటుపడే ప్రమాదం ఉంది. ఈ విజ్ఞాన రంగ పోకడలు పెరిగిపోతున్న తరుణంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భాషా బోధనలను క్రెడిట్స్ పేరుతో కోత పెడితే భాషా శాస్త్రాలు అథ:పాతాళానికి తొక్కబడతాయి. మానవుని చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాల ఆయువు పట్టు భాషా శాస్త్రాలు. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన భాషాశాస్త్రాలను విస్మరిస్తే మానవ జీవన గమనంలో వచ్చేమార్పులు అత్యంత భయానకంగా ఉంటాయి. టెక్కు హైటెక్ విద్యాభ్యాసం చేస్తున్న ప్రస్తుత విద్యార్థికి, మానవ విలువలు జోడించి టెక్నాలజీని సహితం మానవాళి వికాసానికి వినియోగించేలా చేసే బోధనలు భాషా బోధనా శాస్త్రాలు. వాటిని విస్మరిస్తే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉంది. దేశభాషలందు తెలుగు లెస్స అని గర్వంగా చెప్పుకునే తెలుగు భాషను అభివృద్ధిపరిచి భావితరానికి అందించాలనే సోయిలేని పాలకవర్గాలు ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భాషా బోధనలను పూర్తిస్థాయిలో కొనసాగిస్తూ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, సంస్కృతం భాషా బోధనల క్రెడిట్లను యథాతథంగా ఉంచి మానవ సంబంధాలను, డిగ్రీలో భాషా బోధనలను బలోపేతానికి కృషి చేయాలి. అంతిమంగా భాష లేకుండా మానవ జీవన గమనం అసంపూర్తిగా మారుతుందని మనం మర్చిపోవద్దు.
- డా.యండి.మహబూబ్ పాషా