
- తెలుగు దేశం ప్లాన్ సక్సెస్
- ఫలించని మంత్రుల ప్రయత్నాలు
- నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ
- వీధిరౌడీల్లా ప్రవర్తిస్తున్నారన్న జగన్
- ఎథిక్స్ కమిటీకి స్పీకర్ సిఫారసు
- ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణకు అసెంబ్లీలో తీర్మానం
అమరావతి, వెలుగు: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు శాసన మండలి తాత్కాలికంగా బ్రేక్ వేసింది. మండలిలో మెజార్టీ ఉన్న టీడీపీ.. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లును అడ్డుకొంది. బిల్లుపై చర్చ, వాదనల అనంతరం సెలక్ట్ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. దీంతో ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు మరో మూడు నెలలు ఆలస్యం కానుంది. చైర్మన్ తీరుకు నిరసనగా మంత్రులు మండలిలో ఆందోళన చేపట్టారు. అంతకుమందు బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదని చైర్మన్ పోడియంను చుట్టముట్టారు. టీడీపీ ఎమ్మెల్సీలు కూడా ఆందోళనకు దిగడంతోమ మండలిలో గందరగోళం నెలకొంది. మంత్రులు, టీడీపీ సభ్యుల పోటాపోటీ నినాదాలు, కామెంట్లతో మండలి నాలుగు సార్లు వాయిదా పడింది.
బుధవారం ఉదయం 10 గంటలకు శాసనమండలి ప్రారంభం కాగానే వికేంద్రీకరణ బిల్లులపై చర్చకు అనుమతించాలని మంత్రులు పట్టుబట్టారు. అంతకంటే ముందు టీడీపీ ఇచ్చిన రూల్ 143, 71 నోటీసులపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్సీలు కోరారు. నోటీసుపై చర్చకు చైర్మన్ అనుమతించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు చర్చ ప్రారంభించారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీలు అమరావతి తరలింపుకు అంగీకరించేంది లేదని ఆందోళన చేపట్టారు. జై అమరావతి అంటూ నినాదాలు చూస్తూ పోడియం ముట్టడించారు. దీంతో చైర్మన్ సభను 15 నిముషాలు వాయిదా వేశారు. మళ్లీ మండలి ప్రారంభమైన తరువాత టీడీపీ సభ్యులు మాట్లాడుతూ శాసన మండలి లైవ్ ప్రసారాలను ప్రారంభించిన తరువాత చర్చ కొనసాగించాలని చైర్మన్ను కోరారు. టీడీపీ ఎమ్మెల్సీల ప్రవర్తన సరిగా లేదని.. బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని మంత్రులు నిరసనకు దిగారు. పోడియం వద్దకు వెళ్లారు. టీడీపీ సభ్యులు కూడా పోడియం వద్దకు రావడంతో టెన్షన్ నెలకొంది. ఇరిగేషన్ మంత్రి అనిల్కుమార్ యాదవ్, సివిల్ సప్లైస్ మంత్రి కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు, మంత్రులు చూసుకుందామంటే చూసుకుందాం అంటూ చేతులు చూపిస్తూ సవాళ్లు విసురుకున్నారు. తరువాత టీడీపీ పక్షనేత యనుమల మాట్లాడుతూ మండలిలో ఓటు హక్కు లేని మంత్రులు సభ నుంచి బయటకు పంపాలన్నారు. వికేంద్రీకరణ బిల్లులో టీడీపీ సూచించిన రెండు సవరణల మేరకు సెలక్ట్ కమిటీకి పంపాలని కోరారు. సెలక్ట్ కమిటీకి పంపడంపై అవసరమైతే ఓటింగ్ వెళ్లాలన్నారు.
సెలక్ట్ కమిటీకి పంపొద్దు… మంత్రి బుగ్గన
మండలిలో టీడీపీ ఇచ్చిన మోషన్ మూవ్ కానప్పుడు వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాల్సిన అసవరం లేదని ఏపీ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. రూల్స్ ప్రకారం చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపకూడదన్నారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికే ఈ బిల్లు తెస్తున్నట్లు స్పష్టం చేశారు. అందువల్ల వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలపాలని సభ్యులను కోరారు.
జోక్యం చేసుకోవాలని గవర్నర్కు టీడీపీ లేఖ
అసెంబ్లీలో ప్రభుత్వం రూల్స్కు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ టీడీపీ శాసనసభా పక్షం ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ లేఖ రాసింది. రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం పాలనలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరింది. అసెంబ్లీని ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించేలా వెంటనే చర్యలు చేపట్టాలని కోరింది.