- చాకిరేవు నుంచి నిర్మల్ కలెక్టరేట్ దాకా ఆదివాసీల పాదయాత్ర
- సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు
నిర్మల్టౌన్, వెలుగు: దశాబ్దాల నుంచి కరెంటు, తాగే నీళ్లు, రోడ్ల సమస్యలున్నా రాజకీయ నాయకులు, అధికారులు పరిష్కరించలేదు. తీరుస్తామన్న హామీలు నీటిపైన రాతలే అయ్యాయి. ఇక లాభం లేదని ఆ ఆదివాసీ గూడెం గొంతెత్తింది. గూడెపోళ్లు దండు కట్టి పోరుబాట పట్టారు. మహిళలు, మగవాళ్లు, పిల్లలు అంతా కలిసి డిమాండ్ల ఫ్లెక్సీలు కట్టి, ఆదివాసీ జెండా పట్టి 70 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. ఇదీ.. నిర్మల్ జిల్లా పెంబి మండలం చాకిరేవు అనే ఓ చిన్న మారుమూల గూడెం కథ. ఆ గూడేనికి చెందిన వాళ్లంతా పాదయాత్ర ద్వారా మంగళవారం మధ్యాహ్నం నిర్మల్ కలెక్టరేట్కు చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని, సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు నినాదాలు చేశారు. సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించి నిరసన తెలిపారు. వాళ్ల పాదయాత్రకు అడుగడుగునా ఆ గూడెం చుట్టుపక్కలున్న ఊరోళ్లు, ఆదివాసీలు, వివిధ కులస్తులు మద్దతు ప్రకటించారు. భోజనం పెట్టి, నీళ్లిచ్చి సంఘీబావం తెలిపారు. రాత్రి పూట వసతి కూడా కల్పించారు. చాకిరేవు గూడెపోళ్ల శాంతియుత పోరాటానికి బీజేపీ, కాంగ్రెస్ కూడా మద్దతు ప్రకటించాయి. కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టిన ఆదివాసీలకు బీజేపీ భోజన సౌకర్యం కల్పించింది. పెంబి జడ్పీటీసీ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇతర నేతలు ఆదీవాసీలతో కలిసి నిరసనలో
పాల్గొన్నారు.