జంట జలాశయాల గేట్లు ఎత్తివేత

జంట జలాశయాల గేట్లు ఎత్తివేత

రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.  దీంతో రెండు రిజర్వాయర్ల నీటి మట్టాలు పెరిగి నిండుకుండను తలపిస్తున్నాయి. ముఖ్యంగా మంగళవారం ఉదయం నుంచీ వర్షం అధికమవడంతో మొదటగా ఉదయం 8 గంటలకు ఇరు జలాశయాల రెండు గేట్లను 2 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 

తర్వాత మధ్యాహ్నం వరకు వరద ఉద్ధృతి పెరగడంతో .. దీనికి అనుగుణంగా ఎత్తే గేట్ల సంఖ్యను పెంచారు. హిమాయత్ సాగర్ కు 4000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. మరో 4 గేట్ల ద్వారా 4120 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులుండగా.. ప్రస్తుత నీటి మట్టం 1763.50 అడుగులకు చేరింది. 

ఉస్మాన్ సాగర్ కు 1600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. మరో 4 గేట్ల ద్వారా 1380 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790.00 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటి మట్టం 1789.40 అడుగులకు చేరింది. 

మొత్తంగా.. రెండు జలాశయాలకు 5600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 5500 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ను 12 గేట్ల ద్వారా మూసీ నదిలోనికి వదులుతున్నారు. 

ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని  జలమండలి ఎండీ దానకిశోర్ సూచించారు. ఇతర సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.