కేంద్రం కట్టిన దవాఖాన్లపై రాష్ట్రం నిర్లక్ష్యం

కేంద్రం కట్టిన దవాఖాన్లపై రాష్ట్రం నిర్లక్ష్యం

 

  • రూ.300 కోట్లతో వరంగల్​, ఆదిలాబాద్​లో హాస్పిటళ్లు కట్టినా టెస్టుల్లేవ్​, ట్రీట్​మెంట్​ లేదు
  • ఆదిలాబాద్​లో ఇప్పటికీ డాక్టర్లను నియమిస్తలే
  • వరంగల్​లో డాక్టర్ల కాంట్రాక్ట్​ గడువు ముగిసినా పొడిగిస్తలే
  • వందల కోట్లు పెట్టి కట్టినా ఓపీ సేవలే దిక్కు
  • ఎప్పట్లెక్కనే ఎమర్జెన్సీ టైంలో హైదరాబాద్​కు రెఫర్​

వరంగల్/ ఆదిలాబాద్, వెలుగు: సామాన్యులకు సూపర్​స్పెషాలిటీ ట్రీట్​మెంట్​అందించేందుకు రాష్ట్రంలోని ఆదిలాబాద్,  వరంగల్ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం రూ.300 కోట్లతో నిర్మించిన రెండు సూపర్​స్పెషాలిటీ హాస్పిటళ్లు రాష్ట్ర సర్కారు తీరుతో అక్కరకు రాకుండా పోతున్నాయి. ఉస్మానియా, గాంధీ దవాఖాన్లను మించి వైద్యసేవలు అందించాలని భావించినా వట్టిదే అవుతున్నది. ఆదిలాబాద్​లో డాక్టర్​ పోస్టులను నేటికీ భర్తీ చేయని రాష్ట్ర సర్కారు.. వరంగల్​లో 30 మంది డాక్టర్ల కాంట్రాక్ట్​ను నెలరోజులుగా పొడిగించలేదు. అవసరమైన పారామెడికల్​సిబ్బంది లేకపోవడంతో ఎక్విప్​మెంట్​ ఉన్నా టెస్టులు, స్కానింగ్​లు చేయలేని పరిస్థితి. దీంతో ఆయా జిల్లాల నుంచి వచ్చే ఎమర్జెన్సీ పేషెంట్లను ఎప్పట్లాగే ఉస్మానియా, గాంధీ దవాఖాన్లకు పంపుతున్నారు. దీని వల్ల హైదరాబాద్​ తరలించే క్రమంలోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఆదిలాబాద్​లో 42 డాక్టర్​ పోస్టులు ఖాళీ

ఆదిలాబాద్​లోని సూపర్​స్పెషాలిటీ హాస్పిటల్​లో 52 మంది డాక్టర్ల అవసరం ఉండగా, కేవలం13 పోస్టులు భర్తీ చేశారు. మిగతా 39 పోస్టులకు ఎన్నిసార్లు నోటిఫికేషన్​ఇచ్చినా ఒక్కరూ రాలేదు. పైగా మొదట రిక్రూట్​చేసిన డాక్టర్లలో ముగ్గురు ఇటీవల రాజీనామా చేసి వెళ్లిపోయారు. అంటే ప్రస్తుతం 42 డాక్టర్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేట్ లో స్పెషలిస్టు డాక్టర్ల జీతం రూ. 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉండగా.. రాష్ట్ర సర్కారు మాత్రం నెలకు రూ. లక్షా ఇరవై వేలు మాత్రమే ఇస్తున్నది. అది కూడా కాంట్రాక్ట్ పద్ధతిన నియమిస్తుండడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ విషయంపై దృష్టి పెట్టని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారీ నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది.  నిజానికి ప్రధానమంత్రి స్వస్థి సురక్ష యోజన (పీఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వై) కింద ఆదిలాబాద్​కు 210 బెడ్స్​తో 2016లోనే సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్ ను కేంద్రం మంజూరు చేసింది. రిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న 3.42 ఎకరాల దవాఖాన స్థలంలో రూ.150 కోట్లతో నిర్మాణం మొదలుపెట్టారు. 2018లో పూర్తి కావాల్సి ఉండగా.. రూ.30 కోట్ల మ్యాచింగ్​గ్రాంట్ విడుదల చేయడంలో రాష్ట్ర సర్కారు తీవ్ర జాప్యం చేసింది. దీంతో రెండేండ్లు ఆలస్యంగా పనులు పూర్తయ్యాయి. 2022 మార్చి 3న మంత్రి హరీశ్​ ఈ దవాఖానను ఓపెన్​చేసినప్పటికీ పూర్తిస్థాయిలో ఎక్విప్​మెంట్, స్పెషలిస్టు డాక్టర్లు లేకపోవడంతో ఓపీ సేవలకే పరిమితం చేశారు. అది కూడా యూరాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిక్ విభాగాల్లో మాత్రమే ఔట్​పేషెంట్లను చూస్తున్నారు. దీంతో ఎమర్జెన్సీ పేషెంట్లను ఎప్పట్లాగే హైదరాబాద్, కరీంనగర్, మహారాష్ట్రలోని నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ కు తరలిస్తున్నారు. ప్రతి నెలా ఇక్కడి నుంచి సూపర్ స్పెషాలిటీ ట్రీట్​మెంట్​కోసం సగటున 200 మందికి పైగా పేషెంట్లను ఇతర ప్రాంతాలకు రెఫర్​ చేస్తున్నట్లు వైద్య సిబ్బంది చెప్తున్నారు. 

వరంగల్​లోనూ ఓపీ సేవలే..

వరంగల్​కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) ఆవరణలో నిర్మించిన సూపర్​స్పెషాలిటీ దవాఖానాలోనూ డాక్టర్ల కొరత నెలకొంది. దీంతో అవసరమైన వైద్య సేవలు అందడం లేదు. ఇక్కడ 6 అంతస్తుల్లో 250 బెడ్లతో దవాఖాన ఏర్పాటు చేశారు. హైదరాబాద్‍ స్థాయిలో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, మెడికల్ అంకాలజీ, న్యూరో సర్జరీ, కార్డియోథోరాసిక్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పీడియాట్రిక్​సర్జరీ, యూరాలజీ, ఆర్థో బాధితులకు సేవలు అందించాలని భావించారు. 2021 జులైలో ఈ హాస్పిటల్ ప్రారంభించగా.. 40 మంది డాక్టర్లను కాంట్రాక్ట్​ పద్ధతిలో తీసుకున్నారు. వీరిలో 30 మంది డాక్టర్ల కాంట్రాక్ట్​ గడువు ఈ ఏడాది మార్చి 31తోనే ముగిసినా ఇప్పటికీ రెన్యువల్​చేయలేదు. డిసెంబర్ 23 నుంచి కార్డియాలజీ, 2022 జనవరి నుంచి మిగితా విభాగాల్లో ట్రీట్​మెంట్ స్టార్ట్​చేశారు. కార్డియాలజీ విభాగంలో మొదట్లో వివిధ సర్జరీలు చేశారు. ముఖ్యంగా యాంజియోగ్రామ్‍, స్టంట్లు వేసే సర్వీస్ లో మంచిపేరు వచ్చినా.. మార్చి 31న  డాక్టర్ల కాంట్రాక్ట్ ముగియడంతో ఈ విభాగంలో సేవలు బంద్​అయ్యాయి. అధికారుల విజ్ఞప్తి మేరకు కొందరు డాక్టర్లు  అవసరమైనప్పుడు వచ్చి సేవలు అందిస్తున్నారు. డాక్టర్లు తగ్గడంతో ‘2డీ ఈకో’ టెస్టుల కోసమూ ఎదురుచూడాల్సి వస్తున్నది. పారామెడికల్‍, టెక్నీషియన్​ పోస్టులు కూడా ఖాళీగా ఉండడంతో పూర్తి స్థాయి టెస్టులు,  స్కానింగ్​లు​చేయడం లేదు. దీన్ని ప్రైవేట్​ల్యాబ్​టెక్నీషియన్స్ క్యాష్​ చేసుకుంటున్నారు. దవాఖానలోనే పాగా వేసి పేషెంట్స్​ను బయటకు తీసుకువెళ్లి టెస్టులు చేయిస్తూ దండుకుంటున్నారు. ఇలా దవాఖానకు వచ్చి పేషెంట్ల బంధువుల నుంచి డబ్బులు వసూలు చేయడంతో ఇటీవల ఓ ప్రైవేట్​ల్యాబ్‍ టెక్నీషియన్‍పై కేసు నమోదైంది. కార్డియాలజీ, గ్యాస్ట్రో, మెడికల్‍ అంకాలజీ, న్యూరాలజీ డిపార్ట్​మెంట్స్​కేవలం ఓపీకే పరిమితమయ్యాయి. ఈ నాలుగు విభాగాల్లో  సోమ, గురువారాల్లో మాత్రమే ఓపీ అందుతుండగా.. వెయ్యి మంది వరకు పేషెంట్లు వస్తున్నారు. కానీ ఎమర్జెన్సీ టైంలో అంటే.. హార్ట్ఎటాక్, పక్షవాతంతో కాళ్లు చేతులు పడిపోయినప్పుడు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి క్రిటికల్​ కండీషన్​లో వచ్చినప్పుడు ట్రీట్‍మెంట్‍ ఇచ్చే పరిస్థితి లేక తిప్పి పంపుతున్నారు. వారానికి కేవలం రెండు రోజులు అది కూడా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకే ఓపీ చూస్తున్నారు. మిగతా రోజుల్లో ఎంతమంది వచ్చినా సర్వీస్‍ లేదని చెబుతున్నారు. ఈ హాస్పిటల్​లో కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియట్లేదు. ఆపరేషన్లు చేస్తున్నప్పుడు కరెంట్​పోతుండడంతో ఆపరేషన్లు, ఎంఆర్ఐ, స్కానింగ్‍లు ఆగిపోతున్నాయి.  

ఈయన బొజ్జ దత్తు. ఆదిలాబాద్ మండలం జందాపూర్ కు చెందిన దత్తు గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో రిమ్స్​కు తీసుకువెళ్లారు. అక్కడ న్యూరో సర్జన్​లేకపోవడంతో హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. అక్కడ వారం రోజుల చికిత్సకు దాదాపు రూ.లక్షా ఇరవై వేలు ఖర్చయింది. వ్యవసాయ కూలీ అయిన దత్తు అప్పు చేసి ఆ డబ్బులు కట్టాడు. ఇలా ఎంతో మంది పక్కనే ఆదిలాబాద్​లోనే  సూపర్​స్పెషాలిటీ దవాఖాన ఉన్నా అత్యవసర పరిస్థితుల్లో హైదరాబాద్, మహారాష్ట్రకు వెళ్లాల్సి వస్తున్నది.  రూ. 150 కోట్లతో కట్టిన దవాఖానలో స్పెషలిస్టులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఉన్నది. 

డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలి

డాక్టర్ పోస్టులు భర్తీ చేయకుండానే ఆదిలాబాద్​లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించారు. రిమ్స్ ఎమర్జెన్సీలో వైద్యం అందక ఎంతో మంది ఇతర ప్రాంతాల్లోని ప్రైవేట్​హాస్పిటళ్లకు వెళ్తున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు తీసుకెళ్తుండగానే చనిపోతున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు వెళ్తే స్పెషలిస్టులు లేకపోవడం, ఇన్​పేషెంట్​గా చేర్చుకునే అవకాశం లేకపోవడంతో చాలా మంది సఫర్​ అవుతున్నారు. వీలైనంత తొందరగా అన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావాలి. 
- ఇట్టెడి శేఖర్ రెడ్డి, బోథ్


యూనిట్లు లేకనే తక్కువ ఓపీ చూస్తున్నం

వరంగల్​లో సూపర్‍ సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍  ఉన్నప్పటికీ మాకు అందుబాటులో ఉండే యూనిట్స్​ఆధారంగానే డాక్టర్లు, సిబ్బంది సర్వీస్‍ అందించాల్సి ఉంటుంది. మేజర్‍గా చెప్పుకునే కార్డియాలజీ, న్యూరో, గ్యాస్ట్రో తదితర సర్వీసుల్లో ఇప్పటివరకు నలుగురు డాక్టర్లు (ఒక్క యూనిట్​) మాత్రమే వారంలో రెండు రోజులు సేవలందిస్తున్నారు. ఇంకా స్థాయి పెంచలేదు. అందువల్లే మిగతా రోజుల్లో ట్రీట్‍మెంట్‍ అందించలేకపోతున్నాం. సేవలు ఆగకూడదనే ఉద్దేశంతో టెస్టులు, ల్యాబ్‍లకు సంబంధించి ఏ అవసరమున్నా ఎంజీఎం నుంచి పంపిస్తున్నాం. మంచినీటి సమస్య తీర్చేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకువచ్చింది. ఈలోపు చలివేంద్రం ఏర్పాటు చేసేలా గ్రేటర్‍ కమిషనర్‍తో మాట్లాడుతా.
డాక్టర్ చంద్రశేఖర్‍, ఎంజీఎం సూపరింటెండెంట్‍