
- వాళ్లే పోయి బాబు కాళ్లు పట్టుకొని బనకచర్లను బంద్ చేయిస్తరు :జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి
మహబూబ్నగర్, వెలుగు: తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోవర్టులు ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం మోతి ఘన్పూర్లో రూ.50 లక్షల ముడా నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వానికి నేను ఒక ఎమ్మెల్యేగా సూచన చేస్తున్న.
బనకచర్లను ఆపాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్లు రాస్తున్నారు. రాయాల్సింది లెటర్లు కాదు. తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు కోవర్టులు ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, హైదరాబాద్లో దందాలన్నీ వారివే. ఆ కోవర్టులకు నల్లా, కరెంటు కనెక్షన్లు కట్ చేయండి. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి ఇవ్వకండి. అప్పుడు వాళ్లే పోయి బాబు కాళ్లు పట్టుకుంటారు. బనకచర్లను బంద్ చేయిస్తరు. మనం మంచిగా మాట్లాడితే.. ఆ ఆంధ్రావాళ్లు మన మాట వినరు. ఈ పని చేస్తేనే బనకచర్ల బంద్ అవుతుంది' అని అన్నారు.