
- ఔటర్ వెలుపల ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీలకు తాగునీరు
- ఇప్పటికే ఓఆర్ఆర్ వాటర్ ప్రాజెక్టు 1 పూర్తిచేసిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ అవతల ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల నీటి సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని మున్సిపల్కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో నెలకొన్న తీవ్ర నీటి కొరతను తీర్చడానికి మెట్రో వాటర్ బోర్డు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆయా ప్రాంతాల అవసరాల్ని గుర్తించి రోజూ సరఫరా చేసే నీటిని కూడా పెంచుతోంది.
ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ పెద్ద సంఖ్యలో కాలనీలు, విల్లాలు వెలుస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులపై దృష్టి పెడుతున్నారు. దీనికనుగుణంగా తాగునీటిని సరఫరా చేసే బాధ్యత మెట్రోవాటర్బోర్డుపై పడింది. రోజూ వారీగా నగరానికి సరఫరా చేసే నీటి క్వాంటిటీని పెంచుతూ పోతున్నారు. ప్రస్తుతం గ్రేటర్పరిధిలో రోజుకు 550 మిలియన్గ్యాలన్ల నీరు సరఫరా చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నీటి డిమాండ్ఏర్పడడంతో అధికారులు మరిన్ని కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు
రూ.1200 కోట్లతో వాటర్ప్రాజెక్ట్ 2
ఔటర్రింగ్ రోడ్పరిసర ప్రాంతాలు భవిష్యత్తులో కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో నిర్మాణాలు, వివిధ కంపెనీల ఏర్పాటు కార్యక్రమాలు ఊపందుకున్నాయి. దీంతో ఈ ప్రాంతాలకు నీటి అవసరం తప్పనిసరిగా మారింది. దీంతో మెట్రోవాటర్బోర్డు అధికారులు ప్రాజెక్ట్–2 కు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుకు 1200 కోట్లు ఖర్చుగా అంచనా వేస్తున్నారు. ఇందులో మొత్తం 73 సర్వీస్ రిజర్వాయర్లు, 2988 కి.మీ. పరిధిలో పైప్లైన్పనులను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 23 రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవాలు జరిగాయి. మిగిలిన రిజర్వాయర్ల నిర్మాణం తుదిదశకు చేరుకున్నాయి.
ఈ ప్రాజెక్టు పూర్తయితే రోజుకు 136 ఎంజీడీల నీటిని సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ మొత్తం రిజర్వాయర్లు అందుబాటులోకి వస్తే 3.6 లక్షల కుటుంబాలు, వివిధ కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంది. దీని పరిధిలో ఏడు మున్సిపల్కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 24 గ్రామపంచాయతీలు లబ్ధి పొందుతాయి. ఔటర్వాటర్ప్రాజెక్టును కూడా రెండు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. ప్యాకేజీ–1లో 613 కోట్లతో 34 రిజర్వాయర్లు, 1571 కి.మీ. మేరకు పైప్లైన్నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్యాకేజీ పరిధిలోకి సరూర్ నగర్ , మహేశ్వరం, శంషాబాద్, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కీసర మండలాలు వస్తాయి.
రెండో ప్యాకేజీలో 41 సర్వీస్ రిజర్వాయర్లు, 1293 కి.మీ. పైప్లైన్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్యాకేజీ పరిధిలోకి రాజేంద్రనగర్, శామీర్ పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు, ఆర్సీపురం బొల్లారం ప్రాంతాలు వస్తాయి. ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తే ఆయా ప్రాంతాల్లో నీటి సమస్యలు దాదాపు పరిష్కారమవుతాయని అధికారులు భావిస్తున్నారు. వచ్చే వేసవిలో ఆయా ప్రాంతాలకు తాగునీటిని అందించడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.