మేడిపల్లి/మహేశ్వరం, వెలుగు: డ్యూటీలో చేరతామంటూ ఉప్పల్బస్డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. గురువారం విధుల్లో చేరేందుకు దాదాపు 300 మంది కార్మికులు ఉప్పల్డిపోకు వచ్చారు. బేషరతుగా తాము డ్యూటీలో చేరే అవకాశం కల్పించాలని డిపో మేనేజర్వెంకారెడ్డిని కోరారు. అందుకు నిరాకరించిన డీఎం.. యాజమాన్యం నుంచి ఎలాంటి ఆదేశాలు లేనందున డిపోలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
దీంతో కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ కొద్దిసేపు ధర్నా చేశారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఆర్టీసీ డిపో వద్దకు కూడా గురువారం కొంతమంది కార్మికులు చేరుకుని తమను డ్యూటీలో చేర్చుకోవాలని కోరారు. పై నుంచి ఎలాంటి ఆదేశాలు లేనందున ప్రస్తుతం ఎవరినీ విధుల్లోకి చేర్చుకోలేమని డీఎం రవీందర్తెలిపారు. దీంతో నిరాశతో కార్మికులు వెనుదిరిగారు.