తాత అస్థికలు కలపబోయి మనవడు మృతి

తాత అస్థికలు కలపబోయి మనవడు మృతి

మానవపాడు, వెలుగు: తాత అస్థికలు కృష్ణా నదిలో కలిపేందుకు వచ్చిన మనవడు నీట మునిగి మృతి చెందాడు. హైదరాబాద్​లోని గాంధీనగర్ కి చెందిన కార్తీక్ తన తాత అస్థికలు నదిలో కలిపేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్దకు వెళ్లారు. అక్కడి పుష్కరఘాట్ లో అస్థికలు కలుపుతుండగా కార్తీక్, మరో ఇద్దరు స్నేహితులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న జాలర్లు ముగ్గురిని సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే నీళ్లు తాగేసిన కార్తీక్ ను గద్వాల తరలిస్తుండగా దారిలోనే చనిపోయాడు. 
పాతాలగంగలో యువకుడి గల్లంతు
అమ్రాబాద్: ఫ్రెండ్స్​తో సరదాగా గడిపేందుకు వచ్చిన యువకుడు శ్రీశైలం రిజర్వార్​లో పడి గల్లంతయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని మార్కాపూర్​కు చెందిన మహ్మద్ రఫీ ఏడుగురు ఫ్రెండ్స్​తో కలిసి బుధవారం శ్రీశైలం వచ్చాడు. పాతాలగంగ వద్ద నీటిలో దిగాడు. డ్యామ్ గేట్లు ఎత్తి ఉండడంతో నీటి ప్రవాహం పెరిగి రఫీ కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానిక మత్సకారులతో గాలింపు చేపట్టారు. ఆచూకీ దొరకలేదు.