యువకుడిని లారీతో వెంటాడి చంపేశారు

యువకుడిని లారీతో వెంటాడి చంపేశారు

రంగారెడ్డి జిల్లా: యువ‌కుడిపై కక్ష‌తో లారీతో వెంటాడి వేటాడి దారుణంగా చంపేసిన ఘ‌ట‌న గురువారం రంగారెడ్డి జిల్లాలో జ‌రిగింది. పాత కక్షలతో విధ్వంసం వ‌ద్ద‌ని ఎంత వేడుకున్నా విన‌కుండా యువ‌కుడిని రంగారెడ్డి జిల్లా, ఆమనగల్ ఆమండలం, మేడిగడ్డ గేట్ సమీపంలో చంపేశారు. మేడిగడ్డ తండాకు చెందిన బాలకిషన్ సింగ్, నిరంజన్ సింగ్ కుటుంబాల మధ్య 20 ఏళ్లుగా భూ తగాదాలు ఉన్నాయి. నిరంజన్ సింగ్, రాజేష్ సింగ్‌లు అన్నాదమ్ములు. 2004లో జరిగిన ఘర్షణలో వారి తల్లిదండ్రులు హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య తరచూ తగాదాలు జ‌రుగుతున్నాయి.

బాలకిషన్ సింగ్ నుంచి తమకు ప్రాణభయం ఉందని ఇటీవల నిరంజన్ సింగ్, రాజేష్ సింగ్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ భయంతోనే  సోదరులిద్దరూ తమ మిత్రులు, అనుచరులను రక్షణగా ఉంచుకుని రెండు కార్లలలో మేడిగడ్డ గేటు సమీపంలో ఉన్న తమ వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని కూలీలతో వరికోత పనులు చేయిస్తున్నారు. బాలకిషన్ సింగ్ మరో ఐదుగురితో కలిసి లారీలో అక్కడకు చేరుకుని రెండు కార్లను ఢీ కొట్టి ధ్వంసం చేశారు. రాజేష్ సింగ్‌ స్నేహితుడు సందీప్ అడ్డుకోబోతుండగా నిందితులు లారీని అతనిపైకి పోనిచ్చారు. దీంతో ఆయన తప్పించుకునేందుకు రోడ్డుపై పరుగులు తీశాడు. అయినా లారీతో వెంటాడి.. వేటాడి ఢీ కొట్టారు. కిందపడిపోయిన సందీప్ ను లారీతో తొక్కించారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. నిందితులు అక్కడి నుంచి పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్ట‌మ్ కోసం హాస్పిట‌ల్ త‌ర‌లించిన పోలీసులు కేసు న‌మోదు చేశామ‌న్నారు. సందీప్ మ‌ర‌ణ‌వార్త విన్న కుటుంమ స‌భ్యులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు. సినిమా రేంజ్ లో జ‌రిగిన ఈ దార‌ణ సంఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.