థియేటర్ల యజమానులు తప్పనిసరిగా లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. లైసెన్సులు రెన్యువల్ చేసుకోని కొన్ని థియేటర్లను గుర్తించామని, వాటి యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని ఆయన వెల్లడించారు. సైబరాబాద్ పరిధిలోని సినిమా థియేటర్ల యజమానులతో స్టీఫెన్ రవీంద్ర సమావేశమయ్యారు. ఈ భేటీలో థియేటర్ల యజమానులు పాటించాల్సిన నిబంధనలను వివరించారు. లైసెన్సులను రెన్యువల్ చేసుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
థియేటర్ల ముందు తరుచూ ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా జాగ్రతలు తీసుకోవాలని కోరారు. వాహనాలను పార్కింగ్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. సినిమా హాళ్ల నిర్వహణ కోసం నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.సినిమా థియేటర్లలో భద్రతా ప్రమాణాలు లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని రవీంద్ర అన్నారు. ఈ సమావేశంలో రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల సినిమా థియేటర్ల యజమానులు హాజరయ్యారు.