తీన్మార్ మల్లన్న ఫ్యామిలీకి మా సపోర్ట్ ఉంటుంది : వివేక్ వెంకటస్వామి

తీన్మార్ మల్లన్న ఫ్యామిలీకి మా సపోర్ట్ ఉంటుంది : వివేక్ వెంకటస్వామి

తీన్మార్ మల్లన్న, సుదర్శన్ గౌడ్ అరెస్టులను బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు వివేక్ వెంకటస్వామి ఖండించారు. ఎవరు గొంతెత్తి మాట్లాడతారో వాళ్ళను అనిచి వేయడం సీఎంకి అలవాటైందని ఆరోపించారు. ప్రజల పక్షాన నిలిచి, ప్రభుత్వం చేస్తోన్న విధానాలకు ఎండగడుతున్న తీన్మార్ మల్లన్న అరెస్ట్ పై వివేక్ వెంకటస్వామి మండి పడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, ముఖ్యంగా లిక్కర్ స్కామ్ పైన ప్రసారం చేస్తోన్న విధానాలు సీఎంకి నచ్చడం లేదన్నారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రంలో కోట్లల్లో స్కామ్ నడుస్తోందని ఆరోపించారు. కేవలం కమిషన్స్ కోసమే ప్రోజెక్ట్ లు నిర్మిస్తున్నారని, కాళేశ్వరంతో  రైతులకు ఉపయోగం లేదని ఆయన అన్నారు. అన్ని కాంట్రాక్టులు ఆంధ్రావాళ్లకే ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కి తగిన బుద్ధి చెప్పేలా కార్యాచరణ ఉండాలని వివేక్ వెంకటస్వామి ఆకాంక్షించారు. ఈ కార్యాచరణకు అందరం కలిసి ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. తీన్మార్ మల్లన్న ఫ్యామిలీకి తన సపోర్ట్ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. మల్లన్న ఇప్పటివరకూ ఎన్నో సమస్యలపై పోరాడాడని, కాళేశ్వరం అవినీతిపైనా మాట్లాడాడని చెప్పారు. అంతేకాదు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మల్లన్నకు లక్షకు పైగా ఓట్లు పోలయ్యాయని ఆయన గుర్తు చేశారు. అంతకుముందు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ జేఏసీ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రశ్నించే గొంతుకలపై కక్ష.. ప్రజాస్వామ్యానికి ఏది రక్ష .. అనే అంశంపై పలువురు చర్చించారు.