మంచిర్యాల జిల్లాలో అంగన్​వాడీల ప్రమోషన్లు .. ట్రాన్స్​ఫర్లలో అక్రమాలు

మంచిర్యాల జిల్లాలో అంగన్​వాడీల ప్రమోషన్లు .. ట్రాన్స్​ఫర్లలో అక్రమాలు
  • టీచర్లు, హెల్పర్ల దగ్గర ఓ సంఘం లీడర్లు, అధికారుల వసూళ్లు 
  • ఏండ్లుగా పెండింగ్​లోనే ఫైళ్లు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో అంగన్​వాడీ టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్లలో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అర్హులైన హెల్పర్లకు టీచర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని ఏడాది కిందట ప్రభుత్వం ఆర్డర్స్​జారీ చేసింది. అలాగే టీచర్ల ట్రాన్స్​ఫర్లు చేపట్టాలని ఆదేశాలిచ్చింది. కానీ ఆ శాఖ అధికారులు, యూనియన్ల లీడర్లు తమకు అనుకూలంగా ఉన్నవారికి లబ్ధి చేసేందుకు ప్రయత్నిస్తూ ఈ ఫైళ్లను తొక్కిపెట్టారు. పాత జీఓ ప్రకారం ప్రమోషన్లు ఇప్పిస్తామని, స్పౌజ్​​ఆప్షన్​లో ట్రాన్స్​ఫర్లు చేయిస్తామని కొంతమంది దగ్గర రూ.లక్షకు పైగా వసూళ్లు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

పాత జీఓ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలంటూ..

అంగన్​వాడీ టీచర్ల రిక్రూట్​మెంట్, ప్రమోషన్లకు సంబంధించి గైడ్​లైన్స్​ పేర్కొంటూ సెంట్రల్​గవర్నమెంట్​ నిరుడు జనవరిలో సర్క్యులర్ జారీ చేసింది. ఇంటర్​ క్వాలిఫికేషన్​ఉన్నవారినే అంగన్​వాడీ టీచర్లుగా నియమించాలని స్పష్టం చేసింది. ప్రమోషన్లకు తప్పనిసరిగా ఐదేండ్ల సర్వీస్​ కలిగి ఉండి, 45 సంవత్సరాల లోపు వారే అర్హులని పేర్కొన్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మేలో మరో సర్క్యులర్​ను జారీ చేసింది. 

కానీ ప్రమోషన్ల విషయంలో కొంతమంది యూనియన్ లీడర్లు అంతకుముందున్న పాత జీఓను తెరపైకి తెచ్చారు. టెన్త్​ క్వాలిఫికేషన్​తోనే ప్రమోషన్లు ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. పాత జీఓ ప్రకారమే ప్రమోషన్లు ఇప్పిస్తామని కొంతమంది దగ్గర రూ.లక్షకు పైగా వసూళ్లు చేయడమే కాకుండా అందులో అధికారులకు సైతం వాటాలు ఉంటాయని చెప్పినట్టు సమాచారం. 

మందమర్రి మండలానికి చెందిన ఓ హెల్పర్​కు టెన్త్​క్వాలిఫికేషన్​తో ప్రమోషన్​ఇప్పిస్తామని చెప్పి రూ.లక్ష వసూలు చేసినట్టు తెలిసింది. ప్రమోషన్ల ఫైళ్లను నెలల తరబడి పెండింగ్​లో పెట్టడంతో సహజంగానే అధికారుల తీరుపైనా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 4 ఐసీడీఎస్ ​ప్రాజెక్టులు ఉండగా.. చెన్నూర్​లో​5, లక్సెట్టిపేటలో 5, మంచిర్యాలలో 7, బెల్లంపల్లిలో 1, మొత్తం 18 ఫైళ్లు పెండింగ్​లో ఉన్నాయి.  

రూల్స్​కు విరుద్ధంగా ట్రాన్స్​ఫర్లు

అంగన్​వాడీ టీచర్ల బదిలీ విషయంలోనూ యూనియన్ ​లీడర్లు, అధికారులు కుమ్మక్కైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రాన్స్​ఫర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2021 ఏప్రిల్​లో గైడ్​లైన్స్ ​జారీ చేయగా, వాటిని ఇప్పటివరకూ పెండింగ్ ​పెట్టడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రూల్స్​ ప్రకారం ప్రాజెక్టు పరిధిలోనే ట్రాన్స్​ఫర్లు చేయాల్సి ఉన్నప్పటికీ పక్క ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారు కూడా స్పౌస్​ కేటగిరీలో అప్లై చేసుకున్నారు. 

మంచిర్యాల ప్రాజెక్టు పరిధిలోని నస్పూర్​మండలంలో పనిచేస్తున్న ఓ టీచర్ ​మంచిర్యాలకు ట్రాన్స్​ఫర్​ పెట్టుకున్నారు. ఆమెను కాదని లక్సెట్టిపేట ప్రాజెక్టు పరిధిలోని పనిచేస్తున్న మరో టీచర్​ను స్పౌజ్​​ కేటగిరీలో మంచిర్యాలకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. రామకృష్ణాపూర్​లో పనిచేస్తున్న ఓ టీచర్​ రూల్స్​ ప్రకారం బదిలీకి అర్హురాలు కాగా, ఆ స్థానంలో మందమర్రిలో పనిచేస్తున్న మరో టీచర్​ను ట్రాన్స్​ఫర్ చేయడానికి ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసింది. 

కానీ అంగన్​వాడీ టీచర్లకు స్పౌజ్​ కేటగిరీ వర్తించదన్న విషయాన్ని పట్టించుకోకపోవడం విడ్డూరం. ఈ వ్యవహారంలో అధికారుల పేరు చెప్పి ఓ యూనియన్​ లీడర్లు భారీగానే వసూళ్లు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంచిర్యాలలో 5, లక్సెట్టిపేటలో 2, చెన్నూర్​లో 10, బెల్లంపల్లిలో 2 అప్లికేషన్లు వచ్చాయి. ఎట్టకేలకు అడిషనల్ ​కలెక్టర్​ జోక్యంతో డీడబ్ల్యూఓ ఆఫీసులో పెండింగ్​లో ఉన్న ఈ ఫైళ్లు కదులుతున్నట్టు తెలిసింది. అవినీతి, అక్రమాలకు తావులేకుండా ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్లు చేపట్టాలని, యూనియన్​ లీడర్ల జోక్యాన్ని అరికట్టాలని కోరుతున్నారు.