
హైదరాబాద్, వెలుగు:
రాష్ట్రంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ లేదని రాష్ట్ర హెల్త్ ఆఫీసర్లు స్పష్టం చేశారు. ప్రజలు పుకార్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో కరోనా ఉండే చాన్సే లేదని, ఇక్కడి వాతావరణంలో అది బతకదని వివరించారు. వైరస్ వ్యాపించిన చైనాలోని వూహాన్ నగరంలో వాతావరణ పరిస్థితులు, ఇక్కడి పరిస్థితులకు పూర్తి భిన్నమన్నారు. 10 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో కరోనా బతుకుతుందని, నగరంలో కొన్ని రోజులుగా 10 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్ రికార్డవలేదని తెలిపారు. దేశంలోనూ ఇప్పటివరకు పాజిటివ్ కేసులు నమోదవలేదన్నారు.
చైనా నుంచి వచ్చిన వారికే
చైనాలోని వూహాన్ లో కరోనా ప్రబలడంతో కొంత మంది వ్యాధి బారిన పడ్డారని, ఇంకెక్కడా దీని ప్రభావం లేదన్నారు. చైనా నుంచి వచ్చిన వాళ్లు గాని, వాళ్లతో కాంటాక్ట్లో ఉన్న వాళ్లకు గానీ వైరస్ సోకే అవకాశం ఉందన్నారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్లకు జలుబు, జ్వరం, ముక్కు కారడం లాంటి లక్షణాలుంటే అనుమానించాలన్నారు. మిగతా వాళ్లకూ ఇలాంటి లక్షణాలుంటే భయపడాల్సిన అవసరం లేదని, అది కరోనా కాదని వివరించారు. ఇప్పటివరకు చైనా నుంచి 6 వేల మంది ఇండియన్ స్టూడెంట్లు దేశానికి తిరిగొచ్చారని, వాళ్లలో ఎవరికీ కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలలేదని తెలిపారు.
కరోనాపై ప్రజల్లో భయం నెలకొనడంతో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. చైనా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేస్తోంది. వ్యాధి లక్షణాలు కనిపిస్తే బ్లడ్, ఉమ్మి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేస్తున్నారు. చైనాలో ఎంబీబీఎస్ చదువుతున్న ఇద్దరు హైదరాబాదీ స్టూడెంట్లు ఇటీవల నగరానికి వచ్చారు. వాళ్లకు కరోనా టెస్టులు చేయగా నెగిటివ్ వచ్చింది. చైనా, హాంకాంగ్ నుంచి వచ్చిన వాళ్లు స్వయంగా హాస్పిటల్కు వచ్చి టెస్టులు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. కరోనా అనుమానిత కేసుల కోసం హైదరాబాద్లో ఫీవర్ హాస్పిటల్లో 40, గాంధీలో 40, చెస్ట్ హాస్పిటల్లో 20 బెడ్లతో నోడల్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఫీవర్ హాస్పిటల్లో బెడ్లు నిండితే గాంధీకి తరలిస్తామని
చెప్పారు.
‘ఫీవర్’లో నలుగురు అనుమానితులు
సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో మంగళవారం మధ్యాహ్నం నాటికి ఐదుగురు ఫీవర్ హాస్పిటల్లో చేరారు. వీరిలో ఇద్దరికే లక్షణాలు కనిపించటంతో టెస్టులు చేశారు. రెండ్రోజులు ఐసోలేషన్ వార్డులో అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేశారు. హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం మంగళవారం మధ్యాహ్నం చైనా నుంచి వచ్చి అనుమానిత లక్షణాలతో ఫీవర్లో చేరారు. వీళ్ల నుంచి శాంపిల్స్ తీసుకొని పుణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపారు. ప్రస్తుతం ఫీవర్ హాస్పిటల్లో ఐసోలేషన్లో నలుగురు పేషెంట్లు అబ్జర్వేషన్లో ఉన్నారు.
ఫీవర్ హాస్పిటల్లో కేంద్ర వైద్య బృందం
కరోనాను ఎదుర్కోవడానికి రాష్ట్ర సర్కారు చేసిన ఏర్పాట్లను కేంద్ర హెల్త్ బృందం పరిశీలించింది. డాక్టర్ అనితా శర్మ ఆధ్వర్యంలో డాక్టర్లు అజయ్ చౌహాన్, శుభా గార్గే.. ఫీవర్ హాస్పిటల్లోని ఐసోలేషన్ వార్డును మంగళవారం పరిశీలించారు. అనుమానిత లక్షణాలతో ఐసోలేషన్ వార్డులో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్లతో మాట్లాడారు. తర్వాత కరోనా అనుమానిత లక్షణాలతో వచ్చే వారి నుంచి శాంపిల్స్ ఎలా తీసుకోవాలో సిబ్బందికి సూచనలిచ్చారు. చైనా నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడినీ శంషాబాద్ ఎయిర్పోర్టులో స్క్రీనింగ్ చేస్తున్నామని రీజినల్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ చెప్పారు. అనుమానిత లక్షణాలున్న వారి శాంపిల్స్ సేకరించాలని స్పష్టమైన ఆదేశాలున్నాయని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. లక్షణాలుంటేనే శాంపిల్స్ తీసుకుంటున్నామని, లేదంటే అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తున్నామని చెప్పారు. పాములు, పావురాలు, పందులు, గబ్బిలాల మాంసాన్ని తినొద్దని గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్ విజ్ఙప్తి చేశారు.