- 30 శాతం పెరిగిన అప్లికేషన్లు
- ఎక్కువగా ఢిల్లీలోనే..హైదరాబాద్ లో తగ్గింది
- టయర్ 2 సిటీల్లో విశాఖపట్నం టాప్
- ఇండియా లెండ్స్రిపోర్ట్ లో వెల్లడి
పెండ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అంటారు పెద్దలు. ఓ మామూలు కుటుంబంలో పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా తలకు మించిన భారమే మరి. అందుకే ఇప్పటి తరం (మిలీనియల్స్) పెళ్లి కోసం అమ్మానాన్నల సంపాదనపై ఆధారపడొద్దని డిసైడ్ అయ్యారు. తమ పెళ్లిని తామే చేసుకోవాలనుకుంటున్నారు. లోన్ల బాట పడుతున్నారు. మన దేశంలో ఇప్పుడు ఆ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. పెళ్లి కోసం తీసుకుంటున్న లోన్లు 30 శాతం పెరిగాయి. ఇండియాలెండ్స్ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2018–19తో పోలిస్తే 2019–2020లో పెళ్లి కోసం తీసుకున్న లోన్లు బాగా పెరిగాయని రిపోర్ట్ పేర్కొంది.
వాటికే ఎక్కువ ఖర్చు
పెళ్లంటే మామూలు విషయం కాదన్న సంగతి తెలిసిందే. పెళ్లి వేదిక, డెకరేషన్, పెళ్లి బట్టలు, నగలు, చుట్టపక్కాలకు గిఫ్టులు, పెండ్లి భోజనాలు.. వాటికయ్యే ఖర్చు అంతా ఇంతా కాదు. ఇప్పుడు వాటికి కొన్ని కొత్త హంగులూ జత కలిశాయి. స్పెషల్ మేకప్ ఆర్టిస్టులు, ఫొటో షూట్లు, సెషన్ల వంటివి తోడయ్యాయి. దీంతో ఖర్చు మరింత ఎక్కువవుతోంది. అయినా, మిలీనియల్స్ వెనకాడడం లేదు. అలాగని తల్లిదండ్రుల సంపాదనపై ఆధారపడట్లేదట. తమ సొంత డబ్బులతో ఆ హంగామా కానిస్తున్నారట. తమ సంపాదనలో సేవ్ చేసుకున్నది పోనూ, రూ.2 లక్షల నుంచి రూ.30 లక్షల దాకా పెళ్లికి లోన్లు తీసుకుంటున్నారట.
హైదరాబాద్లో పడిపోయింది
మొత్తంగా ఈ ట్రెండ్ పెరిగినా హైదరాబాద్లో మాత్రం తగ్గింది. 2018–19తో పోలిస్తే 2019–2020లో పెండ్లికి లోన్లు తీసుకున్న వారి సంఖ్య 12 శాతం తగ్గిపోయింది. ఇక, ఎక్కువగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో ఈ ట్రెండ్ బాగా ఎక్కువ పెరిగింది. పెండ్లికి లోన్లు తీసుకున్న వారి సంఖ్య ఎకాఎకిన 98 శాతం పెరిగిపోయింది. ఆ తర్వాతి ప్లేస్ కోల్కతాది. 67 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత ముంబై 51%, బెంగళూరులో 44 శాతం వృద్ధి నమోదైంది. టయర్2 సిటీల విషయానికొస్తే విశాఖపట్నం, లక్నోలు 39 శాతం పెరుగుదలతో చార్ట్ను లీడ్ చేస్తున్నాయి. పెండ్లి లోన్ల విషయంలో అబ్బాయిలతో అమ్మాయిలూ పోటీ పడుతున్నారు. మొత్తం లోన్ల అప్లికేషన్లలో అమ్మాయిల వాటానే 42 శాతం మరి. మొత్తంగా పెండ్లి లోన్ల వాటాలో మిలీనియల్స్ భాగం 84%.