అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ లేనట్టేనా? ఆందోళనలో ఇంటర్ స్టూడెంట్లు

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ లేనట్టేనా? ఆందోళనలో ఇంటర్ స్టూడెంట్లు

ఆందోళనలో ఇంటర్ ఫస్టియర్ ఫెయిల్ స్టూడెంట్లు

పరీక్షల కోసం 1.92 లక్షల మంది ఎదురుచూపు
రిజల్ట్ వచ్చి 6 నెలలైనా స్పష్టతనివ్వని ఇంటర్ బోర్డు
సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ తో పాటే పెట్టే యోచనలో సర్కార్

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫస్టియర్ లో ఫెయిలైన స్టూడెంట్లకు అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెట్టే ఆలోచన సర్కార్ పెద్దల్లో కనిపించడం లేదు. ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ చేసి, దాదాపు ఆరు నెలలు కావొస్తున్నా.. కనీసం ఆ దిశగా ఆలోచన కూడా చేయడం లేదు. అయితే ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్​తో పాటే అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వివిధ సబ్జెక్టుల్లో ఫెయిలైన స్టూడెంట్స్​లో ఆందోళన మొదలైంది. రాష్ర్టంలో 2019–20 అకడమిక్ ఇయర్ లో 4,80,555 మంది స్టూడెంట్లు ఫస్టియర్ ఎగ్జామ్స్ రాశారు. వీరిలో 2,88,383 (60.01శాతం) మంది పాస్​కాగా… 1,92,172 మంది ఫెయిల్​అయ్యారు. అయితే అప్పట్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహణ సాధ్యం కాదని, సెకండియర్​లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అందరినీ పాస్ చేశారు. కొందరు ఫీజు కట్టి ఎగ్జామ్‌‌ రాయకున్నా, వారినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఫస్టియర్ స్టూడెంట్స్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇంప్రూవ్ మెంట్ కోసం పాసైన స్టూడెంట్లలోనూ ఆందోళన 

ఫస్టియర్​లో ఫెయిలైన స్టూడెంట్స్1.92 లక్షల మంది ఉండగా.. 75 శాతం కంటే తక్కువ మార్కులతో పాసైనోళ్లు 1,24,138 మంది ఉన్నారు. కరోనా తీవ్రత తగ్గినంక అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీతో పాటు ఇంప్రూవ్​మెంట్ కు అవకాశమిస్తామని అధికారులు ప్రకటించారు. కనీసం ఆగస్టు, సెప్టెంబర్​లోనైనా పరీక్షలుంటాయని అంతా భావించారు. కానీ జూన్ లో ఇంటర్ రిజల్ట్స్ ఇచ్చిన అధికారులు.. ఇప్పటి వరకు ఎగ్జామ్స్ నిర్వహణపై ఆలోచన చేయలేదు. దీంతో అటు ఫెయిలైన స్టూడెంట్లు, ఇటు ఇంప్రూవ్ మెంట్ రాయాలనుకున్న స్టూడెంట్లు ఆందోళనలో ఉన్నారు. ఎగ్జామ్స్ పెట్టాలని స్టూడెంట్స్, పేరెంట్స్ నుంచి విజ్ఞప్తులు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే పోలీస్​స్టేషన్లలోని క్వశ్చన్​పేపర్లనూ ఇంటర్ అధికారులు వెనక్కి తీసుకున్నారు. దీంతో అడ్వాన్స్​డ్ పరీక్షలు నిర్వహించాలనే ఆలోచనను విరమించుకున్నట్టేనని తెలుస్తోంది.

సెకండియర్ ఎగ్జామ్స్​కు ఒక నెల ముందు సప్లిమెంటరీ! 

ప్రస్తుతం సెకండియర్ స్టూడెంట్లకు డిజిటల్ క్లాసులు నడుస్తున్నాయి. ఫిజికల్ క్లాసులపై సర్కార్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ క్లాసుల ఆధారంగానే ఎగ్జామ్ డేట్స్ ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ జనవరిలో ఫిజికల్ క్లాసులు ప్రారంభిస్తే.. ఏప్రిల్/మేలో ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహించినా, అంతకంటే ఒక నెల ముందు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెట్టాలని భావిస్తున్నామని ఇంటర్ బోర్డు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన రాలేదన్నారు. కరోనా కేసులు తగ్గకపోవడంతో, ప్రభుత్వం పరీక్షలకు అనుమతించడం లేదని చెప్పారు. సెకండియర్ ఎగ్జామ్స్ తో పాటే సప్లిమెంటరీ నిర్వహిస్తే ప్రిపరేషన్​కు ఇబ్బందులు ఎదురవుతాయని, కాబట్టి వెంటనే ఎగ్జామ్స్ నిర్వహించాలని స్టూడెంట్లు కోరుతున్నారు.

ఫెయిలైనోళ్లందరినీ పాస్ చేయాలె

ఫస్టియర్ లో ఫెయిలైన వారందరినీ ప్రభుత్వం పాస్ చేయాలి. లేకపోతే సెకండియర్​తో పాటే ఫస్టియర్ ఎగ్జామ్స్ రాయడం స్టూడెంట్స్ కు కష్టమవుతుంది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించకపోతే సర్కార్ కాలేజీల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్లే ఎక్కువగా నష్టపోతారు. ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి వెంటనే నిర్ణయం తీసుకోవాలి.

– మధుసూదన్​రెడ్డి, ఇంటర్ జేఏసీ చైర్మన్

For More News..

రిజిస్ట్రేషన్లు పాత పద్ధతి అని హైకోర్టుకు చెప్పి.. కొత్త పద్ధతిలో ప్రారంభించిన సర్కార్

రోడ్ల రిపేర్లకు పైసా ఇయ్యని సర్కారు

కేసీఆర్ రెండేండ్ల పాలన నేటితో పూర్తి.. బయటకు రాలే.. బాధలు పట్టించుకోలే