మహబూబాబాద్, వెలుగు: వడ్లు, మక్కల కొనుగోలులో ఆలస్యం జరగకుండా చూడాలని మంత్రి సీతక్క సూచించారు. మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
మక్కలు, వడ్ల కొనుగోళ్ల విషయంలో కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేస్తోందన్నారు.
గ్రామాలు, పట్టణాల్లోని పేదల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో కొందరు అటవీ, పోడు భూముల్లో నివాస స్థలాలు ఏర్పరచుకొని ఉన్నారని, వారిని ఫారెస్ట్ ఆఫీసర్లు ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, పేదలను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు.
రాజ్యసభ సభ్యులు వేం నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. జూన్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లాలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్, ఎస్పీ ఆఫీస్, ఉద్యానవన యూనివర్సిటీ, జేఎన్టీయూ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలు, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
సమావేశంలో ఎంపీ పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్, ఎస్పీ డాక్టర్ శబరీష్, ఫారెస్ట్ ఆఫీసర్ విశాల్ బత్తుల, అడిషనల్ కలెక్టర్ అనిల్కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్రెడ్డి, మహబూబాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గుగులోతు జ్యోతి, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, డీఆర్డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జడ్పీ సీఈవో పురుషోత్తం పాల్గొన్నారు.
