జనవరి 1 తర్వాత శుభవార్త ఉంటుంది

జనవరి 1 తర్వాత శుభవార్త ఉంటుంది
  • బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

సూర్యాపేట: ‘ఏడేళ్ళ పాలనలో రాష్ట్ర నిధులన్నీ సిద్దిపేట , గజ్వేల్ నియోజకవర్గాలకే వెళ్తున్నా మంత్రులు నోరుమెదపడంలేదు. నిన్నటి నల్లగొండ పర్యటనలో నిజాలు ఒప్పుకున్న కేసీఆర్ కి ధన్యవాదాలు’అని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. గురువారం బీజేపీ జిల్లా శిక్షణ తరగతులు మూడో రోజు కార్యక్రమానికి ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జిల్లాల పర్యటనలో ఇచ్చిన హామీలను కేసీఆర్ ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామన్న కేసీఆర్ ఆ మాటే మరిచారని విమర్శించారు. కేవలం అధికారం , కమీషన్ల కోసమే పని చేస్తున్నట్లు ఉంది అని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో ఉత్తర్వులు ఇప్పించింది మేమేనని, ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు చేసింది శూన్యం అన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రితో  రాష్ట్ర బీజేపీ నేతల బృందం మాట్లాడి 6 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు కొనుగోలుకు ఒప్పించ్చామన్నారు. బీజేపీలోకి రావడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపిస్తున్నది వాస్తవమేనని, జనవరి 1 తరువాత శుభవార్త ఉంటుందని ఎమ్మెల్యే రఘునందన్ రావు వెల్లడించారు.