పోలీసులు సీజ్ చేయగా.. వారి కళ్లు గప్పి మళ్లీ చోరీ
గచ్చిబౌలి, వెలుగు: బైక్ కొట్టేసి డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డ ఓ దొంగ.. పోలీసులు సీజ్ చేసిన అదే బైక్ను మళ్లీ చోరీ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కూకట్ పల్లిలోని బాలాజీనగర్కు చెందిన శివయ్య శుక్రవారం రాత్రి స్కూటీపై కేపీహెచ్బీలోని ఓ మాల్లో షాపింగ్కు వెళ్లాడు. బయటకు వచ్చేసరికి బైక్ కనిపించలేదు. వెంటనే కేపీహెచ్బీ పీఎస్లో కంప్లయింట్చేశాడు. ఇదిలా ఉంటే, మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు అదే రోజు రాత్రి డ్రంకెన్ డ్రైవ్ చేపట్టగా బి. కుమార్అనే వ్యక్తి మద్యం తాగి వారికి చిక్కాడు. కుమార్ దగ్గరున్న బైక్ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసి అతడిని పంపించేశారు. బైక్ను మాదాపూర్ పీఎస్కు తరలించి.. అది శివయ్య పేరు మీదు ఉన్నట్లు గుర్తించారు.
అప్పటికే కేపీహెచ్బీ పీఎస్లో బైక్ చోరీపై కంప్లయింట్ ఉండటంతో దాని ఆధారంగా మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు శివయ్యకు కాల్ చేసి.. మీ స్కూటీ దొరికిందని, పీఎస్కు వచ్చి బైక్ తీసుకెళ్లాలని చెప్పారు. శివయ్య శనివారం ఉదయం అక్కడికి వెళ్లగా.. స్కూటీ కనిపించలేదు. స్టేషన్ పార్క్ చేసిన బైక్ మాయమవడంతో ట్రాఫిక్ పోలీసులు కంగుతిన్నారు. రాత్రి పట్టుబడ్డ కుమార్ అనే వ్యక్తే మళ్లీ బైక్ను దొంగిలించినట్లు గుర్తించారు. కుమార్ గతంలోనూ చోరీలకు పాల్పడినట్లు తెలుసుకున్నారు. మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్ రాయదుర్గం పరిధిలో ఉండటంతో అక్కడి లా అండ్ ఆర్డర్ పీఎస్లో కంప్లయింట్ చేశారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.