చోరీకి వచ్చి బావిలో,, పడి దొంగ మృతి

చోరీకి వచ్చి బావిలో,,  పడి దొంగ మృతి

మంచిర్యాల, వెలుగు:  ఓ ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ బావిలో పడి చనిపోయాడు. డెడ్ బాడీ దుర్వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలోని రావికంటి జనార్దన్ ఇంట్లో గురువారం దొంగలు పడ్డారు. ఇద్దరు దొంగలు ఇనుప రాడ్లతో ఉదయం 11:30 గంటలకు ఇంటి దగ్గరికి వచ్చారు. మొదట ఇంటి బయట ఉన్న ఇనుప వస్తువులను దొంగిలించుకుని వెళ్లారు. ఆ తర్వాత వెంటనే మళ్లీ వచ్చారు. 

ఓ వ్యక్తి కాంపౌండ్ బయట ఉండగా, మరో వ్యక్తి గోడ దూకబోయి అదుపుతప్పి పక్కనే ఉన్న బావిలో పడ్డాడు. దీంతో బయట ఉన్న దొంగ ఆందోళనకు గురై పారిపోతుండగా స్థానికులు పట్టుకున్నారు. డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన బ్లూకోల్ట్​కానిస్టేబుళ్లు.. దొంగను విచారించగా ఇనుప సామాను దొంగలించినట్టు చెప్పాడు. అతడు బాగా తాగి ఉండడంతో పోలీసులు వదిలిపెట్టినట్టు తెలిసింది. అయితే శుక్రవారం అర్ధరాత్రి బావిలో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని వెళ్లి చూడగా డెడ్​బాడీ కనిపించింది. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి డెడ్​బాడీని వెలికితీసి, ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అనంతరం సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి.. చనిపోయింది దొంగ అని నిర్ధారించారు. ఆ రోజు ఇద్దరు దొంగలు వచ్చారని గుర్తించారు. మృతుడు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్ ప్రాంతానికి చెందిన శంకర్ అని, మరో దొంగ మహేశ్​అని అనుమానిస్తున్నారు. ఇంటి ఓనర్ జనార్దన్​ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.